తమిళనాడులోని కరూర్లో జరిగిన భయానక తొక్కిసలాట ఘటన(TVK Vijay Rally in Stampede)లో మృతుల సంఖ్య 38కి పెరిగిన విషయం ఇప్పటికే దేశవ్యాప్తంగా దుఃఖాన్ని కలిగించింది. పెద్దఎత్తున అభిమానులు, కార్యకర్తలు గుమిగూడడంతో ఏర్పడిన గందరగోళం ఒక్కసారిగా ప్రాణాంతకర పరిస్థితులకు దారి తీసింది. సంఘటన జరిగిన తర్వాత అక్కడి వైద్యులు, రెస్క్యూ బృందాలు రాత్రింబవళ్ళు పనిచేస్తూ గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలిస్తున్నారు. చిన్నారులు, మహిళలు సహా మరణించిన వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.
ఈ ఘటనలో గాయపడిన వారిని తమిళనాడు విద్యాశాఖ మంత్రి అన్బిల్ మహేశ్(Minister Anbil Mahesh ) ఆసుపత్రిలో పరామర్శించారు. క్షతగాత్రులు, వారి కుటుంబ సభ్యుల ఆర్తనాదాలను, ఆందోళనకర పరిస్థితులను స్వయంగా చూశాక మంత్రి కళ్లపట్టునే భావోద్వేగానికి లోనయ్యారు. “కండీషన్స్ పాటించండి, పాటించండి అని చెబితే విన్నారా?” అంటూ విలపిస్తూ తన ఆవేదనను వ్యక్తం చేశారు. బాధితులకు ఆపన్నహస్తం అందించాలని అధికారులను ఆదేశించారు.
ఈ సంఘటన రాష్ట్రంలో ప్రజా భద్రతపై తీవ్ర చర్చకు దారితీసింది. పెద్ద ఎత్తున జరిగే సభల్లో భద్రతా చర్యలు తీసుకోవడంలో అలసత్వం వల్లే ఇలాంటి దుర్ఘటనలు జరుగుతున్నాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇకపై ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠినమైన నియమాలు అమలు చేయాలని ప్రజలు, నిపుణులు డిమాండ్ చేస్తున్నారు. కరూర్ ఘటన నుంచి పాఠాలు నేర్చుకుని, తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని విశ్లేషకులు సూచిస్తున్నారు.