విశ్రాంత ఇంజినీర్ కన్నయ్య నాయుడు (Kannayyanayudu )ను ఏపీ ప్రభుత్వం (AP Govt) రాష్ట్ర జలవనరులశాఖ మెకానికల్ సలహాదారుడిగా నియమించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల తుంగభద్ర డ్యాంకు చెందిన ఒక గేట్ కొట్టుకుపోయి నీరంతా సముద్రంలో కలిసి పోయింది. ఈ పరిస్థితుల్లో నీటిపారుదల రంగానికి చెందిన సీనియర్ ఇంజినీర్ కన్నయ్యనాయుడు సేవలను ప్రభుత్వం వినియోగించుకుంది.
We’re now on WhatsApp. Click to Join.
తుంగభద్ర డ్యామ్ (Tungabhadra Dam)లో గల్లంతైన 19వ గేటు స్థానంలో స్టాప్ లాగ్ (Stop log ) ఏర్పాటు దగ్గరుండి చేయించి నీటి వృథాను అడ్డుకున్నారు. డ్యాంల గేట్లు తయారీలో నైపుణ్యం ఉన్న సాగునీటి నిపుణులు కన్నయ్య నాయుడిని చంద్రబాబుతో పాటు మంత్రులు సత్కరించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల గేట్ల విషయంలో ఆందోళన వ్యక్తం చేస్తున్న ప్రభుత్వం కన్నయ్యనాయుడిని సలహాదారుడిగా నియమించింది.
కన్నయ్య విషయానికి వస్తే..ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా గుడిపాల మండలం రాసానపల్లెలో 1946లో రైతు కుటుంబంలో కన్నయ్య జన్మించాడు. తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం (ఎస్వీయూ)లో మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తిచేసాడు. ఇక తమిళనాడులోని సదరన్ స్ట్రక్చర్స్ కంపెనీలో కొంతకాలం పనిచేసిన ఆయన హోస్పేట్ సమీపంలోని తుంగభద్ర స్టీల్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ లో డిజైన్స్ విభాగంలో పలు పదవులు చేపట్టాడు. జలాశయాలకు క్రస్ట్ గేట్ల నిర్మాణం, విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లలో యంత్రాల అమరిక వంటి ఇంజనీరింగ్ పనులలో అనుభవం ఉన్న ఆయన.. దేశవ్యాప్తంగా రెండు వందలకు పైగా ప్రాజెక్టుల గేట్ల నిర్మాణంలో పాల్గొన్నాడు. ఉభయ తెలుగు రాష్ట్రాలలో శ్రీశైలం, నాగార్జునసాగర్, సోమశిల, ప్రియదర్శిని జూరాల ఆనకట్టల గేట్ల నిర్మాణం, మరమ్మతుల్లోనూ ఆయన పాల్గొన్నాడు. ముఖ్యంగా, ప్రకాశం బ్యారేజి నీటిమట్టం తగ్గించకుండానే గేటుకు మరమ్మతులు చేయించిన ఘనత ఆయనది.
Read Also : DK Shiva Kumar : అక్రమ ఆస్తుల కేసులో డీకే శివకుమార్కు భారీ ఊరట..!