Kakani Govardhan Reddy : నెల్లూరు సెంట్రల్‌ జైలుకు కాకాణి

Kakani Govardhan Reddy : కాకాణి గోవర్ధన్‌రెడ్డి (Kakani Govardhan Reddy)కి వచ్చే నెల 9వ తేదీ వరకు రిమాండ్‌ న్యాయస్థానం విధించడం తో కాసేపట్లో ఆయన్ను నెల్లూరు సెంట్రల్‌ జైలుకి తరలించబోతున్నారు. 55 రోజులుగా పరారీలో ఉన్న కాకాణి ఎట్టకేలకు

Published By: HashtagU Telugu Desk
Kakani Nellur Jailu

Kakani Nellur Jailu

మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి (Kakani Govardhan Reddy)కి వచ్చే నెల 9వ తేదీ వరకు రిమాండ్‌ న్యాయస్థానం విధించడం తో కాసేపట్లో ఆయన్ను నెల్లూరు సెంట్రల్‌ జైలుకి తరలించబోతున్నారు. 55 రోజులుగా పరారీలో ఉన్న కాకాణి ఎట్టకేలకు బెంగళూరు సమీపంలోని ఓ పల్లెటూరిలోని రిసార్ట్‌లో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు ఆదివారం సాయంత్రం అదుపులోకి తీసుకున్నారు. క్వార్ట్జ్‌ అక్రమ తవ్వకాలు, అక్రమ రవాణా, నిబంధనలకు విరుద్ధంగా పేలుడు పదార్థాల వినియోగం, అభ్యంతరం వ్యక్తం చేసిన గిరిజనులపై బెదిరింపులకు తెగబడటం తదితర అభియోగాలపై నెల్లూరు జిల్లా పొదలకూరు పోలీస్​స్టేషన్​లో నమోదైన కేసులో కాకాణిని అదుపులోకి తీసుకున్నారు.

Rapido : తెలంగాణ వ్యాప్తంగా తన యాప్-ఆధారిత మొబిలిటీ సేవలను విస్తరించిన రాపిడో

బెంగళూరు సమీపంలో అదుపులోకి తీసుకున్న తర్వాత అక్కడి నుంచి కాకాణి గోవర్ధన్​రెడ్డిని నెల్లూరుకు తీసుకొచ్చి న్యాయస్థానంలో హాజరుపరచగా..కోర్ట్ రిమాండ్ విధించింది. చెన్నైకు చెందిన విద్యాకిరణ్‌కు నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం తాటిపర్తి సమీపంలో 32 ఎకరాల్లో ‘రుస్తుం మైన్’ పేరిట క్వార్ట్జ్ తవ్వకాలకు అనుమతి ఉండగా, లీజు గడువు ముగిసిన తర్వాత ఆయన రెన్యువల్‌కు దరఖాస్తు చేశారు. అయితే 2019లో వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత క్వార్ట్జ్‌కు భారీ డిమాండ్ ఏర్పడటంతో పార్టీలోని కీలక నాయకులు దానిపై కన్నేశారు. అప్పట్లో వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్న కాకాణి గోవర్ధన్ రెడ్డి అండతో పెద్ద ఎత్తున అక్రమ తవ్వకాలు జరిగి క్వార్ట్జ్ తరలింపు జరిగింది. ఈ ప్రాంతమంతా కాకాణి స్వగ్రామమైన తోడేరుకు సమీపంలో ఉండటంతో అధికారులెవరూ కదలలేని పరిస్థితి ఏర్పడింది. స్థానిక గిరిజనులు అక్రమ తవ్వకాలకు, పేలుళ్లకు వ్యతిరేకంగా ఆందోళనలు చేసినా, కాకాణి అండ్ కో బెదిరింపులతో వారు నిశ్శబ్దంగా ఉండిపోయారు.

AP Govt : వైఎస్సార్‌ జిల్లా పేరు మారుస్తూ జీవో జారీ

ఈ అక్రమాలను వ్యతిరేకిస్తూ అప్పటి టీడీపీ నాయకుడు, ప్రస్తుత సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి దీక్షలు చేపట్టారు. కానీ ఆయనపై కాకాణి అనుచరులు హిజ్రాలు, రౌడీలను ఉసిగొల్పారు. వరుస ఫిర్యాదులపై ఎన్నికలకు కొద్దిరోజుల ముందు అధికారులు తనిఖీలు నిర్వహించి 61,313 టన్నుల క్వార్ట్జ్ అక్రమంగా తవ్వినట్టు గుర్తించి, రూ.7.56 కోట్ల జరిమానాతో షోకాజ్ నోటీసులు జారీ చేశారు. వాటిపై స్పందన లేకపోవడంతో 2024 ఫిబ్రవరి 16న పోలీసుల కేసు నమోదైంది. దర్యాప్తులో కాకాణి ప్రధానపాత్రలో ఉన్నట్టు తేలడంతో ఆయన నాలుగో నిందితుడిగా నమోదయ్యారు. ఇతర వైఎస్సార్సీపీ నేతలతో పాటు మరిన్ని పేర్లు బయటపడ్డాయి.

KTR Camp Office : కేటీఆర్ క్యాంపు కార్యాలయం వద్ద ఉద్రిక్తత

కేసులో విచారణకు హాజరు కావాలని పలుమార్లు నోటీసులు ఇచ్చినా కాకాణి స్పందించక, పోలీసులకు అందుబాటులో లేకపోయారు. ఆయన తమిళనాడు, కర్ణాటక, కేరళ, తెలంగాణలో స్థావరాలు మారుస్తూ పరారీలో ఉండిపోయారు. చివరికి బెంగళూరు సమీపంలోని ఓ పల్లెటూరిలోని రిసార్టులో దొరికిపోయారు. సుప్రీంకోర్టు కూడా ముందస్తు బెయిల్‌ను తిరస్కరించడంతో పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. అధికారంలో ఉన్న సమయంలో అనేక అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై కేసులు నమోదు కావడంతో, ఆయనపై దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. ప్రస్తుతం కాకాణిని జూన్ 9 వరకు రిమాండ్‌లోకి తీసుకొని, నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలిస్తున్నారు.

  Last Updated: 26 May 2025, 03:51 PM IST