KA Paul: ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు చంద్ర‌బాబు నుంచి ప్రాణ‌హాని ఉంద‌న్న కేఏ పాల్.. ఎలా అంటే..

ఎన్టీఆర్‌ను మాన‌సికక్షోభ‌కు గురిచేసి చ‌నిపోయేలా చేసిన‌ చంద్ర‌బాబు నాయుడు రాజ‌కీయంకోసం ఏదైనా చేస్తాడ‌ని పాల్ విమ‌ర్శించారు.

  • Written By:
  • Publish Date - June 14, 2023 / 10:38 PM IST

ప్ర‌జాశాంతి పార్టీ అధ్య‌క్షుడు కేఏ పాల్  (KA Paul) సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ (Pawan Kalyan) కు ప్రాణ‌హాని ఉంద‌ని, అదికూడా చంద్ర‌బాబు (Chandrababu) నుంచే ఉంటుందంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. వారాహి యాత్ర‌ (Varahi Yatra) ను ప్రారంభించిన ప‌వ‌న్.. ముఖ్య‌మంత్రి అభ్య‌ర్థిగా ప్ర‌క‌టించుకోవాల‌ని అన్నారు. అలా ప్ర‌క‌టించుకోకుంటే బీసీలు, కాపులు ప‌వ‌న్ వారాహి యాత్ర‌కు ఎవ‌రూ వెళ్లొద్ద‌ని పాల్ కోరారు. 56శాతం ఉన్న బీసీలు ఒక్క‌సారికూడా ముఖ్య‌మంత్రి కాలేద‌ని అన్నారు. గ‌తంలో చిరంజీవికి కాపులంతా మ‌ద్ద‌తిచ్చార‌ని, కానీ ఓడిపోవ‌టంతో పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేశార‌ని గుర్తు చేశారు. కానీ, ప్ర‌జారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసినందుకు చిరంజీవి ఇప్పుడు బాధ‌ప‌డుతున్నాడ‌ని పాల్ అన్నారు.

వైసీపీ అధినేత‌, సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని మ‌రోసారి అధికారంలోకి రాకుండా అడ్డుకుంటాన‌ని చెబుతూ ప‌వ‌న్ క‌ళ్యాణ్ చంద్ర‌బాబుకు మ‌ద్ద‌తు ఇవ్వ‌డం స‌రికాద‌ని కేఏ పాల్‌ సూచించారు. చంద్ర‌బాబు, బీజేపీ వ‌ల్లే ఏపీ అభివృద్ధి చెంద‌టం లేద‌ని, అలాంటివారి ప‌క్క‌న ఉండి ప‌వ‌న్ స్వార్థ రాజ‌కీయాలు చేస్తున్న వ్య‌క్తిగా ప్ర‌జ‌ల్లో ముద్ర వేసుకుంటున్నార‌ని, ఇప్ప‌టికైన‌ ప‌వ‌న్ స్వార్థ రాజ‌కీయాలు వ‌దిలివేయాల‌ని పాల్‌ సూచించారు.

ఎన్టీఆర్‌ను మాన‌సికక్షోభ‌కు గురిచేసి చ‌నిపోయేలా చేసిన‌ చంద్ర‌బాబు నాయుడు రాజ‌కీయంకోసం ఏదైనా చేస్తాడ‌ని పాల్ విమ‌ర్శించారు. లోకేష్ ను ముఖ్య‌మంత్రిని చేయ‌డంకోసం చంద్ర‌బాబు ఎంత‌టికైనా తెగిస్తాడ‌ని, ఆ క్ర‌మంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ కు ప్రాణ‌హాని ఉంద‌ని అన్నారు. చంద్ర‌బాబు ప‌వ‌న్‌కు హానిచేసి దానిని జ‌గ‌న్‌మీద నెట్ట‌డం ద్వారా సానుభూతిపొంది గెల‌వాల‌ని చూసినా ఆశ్చ‌ర్య‌పోన‌వ‌స‌రం లేదంటూ చంద్ర‌బాబుపై పాల్ తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు చేశారు.