Chandrababu Skill Development Case : స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) క్లీన్ చిట్ ఇచ్చింది. జగన్ ప్రభుత్వ హయాంలో ఏపీ సీఐడీ నమోదు చేసిన కేసు ఆధారంగా ఈడీ విచారణ జరుపుతోంది. తాజాగా ఈడీ చేసిన ప్రకటన కీలకంగా మారింది, ఇందులో సీఎం చంద్రబాబుకు ఈ కేసులో ఎలాంటి ప్రమేయం లేదని తేలింది. ఈడీ విచారణ ప్రకారం, నిధుల డైవర్షన్ విషయమై చంద్రబాబుకు సంబంధించిన ప్రమేయం లేదని నిరూపించబడింది. స్కిల్ డెవలప్మెంట్ కేసుపై వైసీపీ నేతలు చేసే అసత్య ప్రచారాన్ని ఈడీ వర్గాలు తప్పు పట్టాయి.
ఈ కేసులో తాజా ఆస్తుల అటాచ్మెంట్ విషయంలో చంద్రబాబుకు ఎలాంటి సంబంధం లేదని ఈడీ స్పష్టం చేసింది. వినాయక్ ఖాన్వెల్కర్, సుమన్ బోస్ వంటి పలువురు బోగస్ ఇన్వాయిస్లు సృష్టించినట్లు గుర్తించారు. ఈడీ స్టేట్మెంట్లో చంద్రబాబుకు వ్యతిరేకంగా ఒక్క మాట కూడా నమోదుకాకపోవడం, మొత్తం వ్యవహారంలో ఆయనకు లేదా ఆయనకు సంబంధించిన వారికి డబ్బులు అందినట్లుగా ఎక్కడా ప్రస్తావించకపోవడంతో క్లీన్ చిట్ ఇచ్చినట్లుగా వార్తలు వస్తున్నాయి.
అయితే, స్కిల్ కేసులో జగన్ ప్రభుత్వ హయాంలో చంద్రబాబుకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అరెస్టు చేయడం జరిగింది. 53 రోజులు తర్వాత ఆయనకు బెయిల్ వచ్చింది. ఆ సమయంలో సీఐడీ అధికారులు ఒక్క రూపాయి అక్రమ లావాదీవీని కూడా చూపించలేకపోయారు అని న్యాయస్థానం స్పష్టం చేసింది.
2023, సెప్టెంబర్ 9న ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో ప్రతిపక్ష నేత, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడును నంద్యాలలో పోలీసులు అరెస్టు చేశారు. తర్వాత ఆయనను బస్సులో విజయవాడలోని ఏసీబీ కోర్టుకు తరలించారు. ఈ కేసులో చంద్రబాబుకు ఏసీబీ కోర్టు జ్యూడిషియల్ రిమాండ్ విధించింది, దీంతో ఆయనను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. ఈ కేసులో బెయిల్ కోసం చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి, చివరకు దాదాపు 52 రోజుల తర్వాత చంద్రబాబునాయుడు బెయిల్పై విడుదలయ్యారు.
చంద్రబాబు నాయుడు అరెస్ట్ తర్వాత ఆంధ్రప్రదేశ్లో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఆయన అరెస్టుతో యువగళం పాదయాత్రను నారా లోకేశ్ తాత్కాలికంగా నిలిపివేశారు. చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి కూడా ఇల్లు వదలి ప్రజల మధ్యకు వచ్చారు. నారా లోకేశ్ మరియు నారా భువనేశ్వరి ఇద్దరూ చంద్రబాబును జైలులో సందర్శించి, ఆయన క్షేమ సమాచారాన్ని ప్రజలకు తెలియజేశారు.
చంద్రబాబు అక్రమ అరెస్ట్ నేపథ్యంలో వందలాది మంది నిరసన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల మధ్య, “నిజం గెలవాలి” పేరిట నారా భువనేశ్వరి మృతుల కుటుంబాలను పరామర్శించారు. వారికి ఆర్థిక సాయం అందించడమే కాకుండా, “మీకు, మీ కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని” భరోసా ఇచ్చారు.