రాజకీయ పార్టీల(political parties)జాతకాలను తారుమారు చేయడానికి ఒక్క మాట(one word) చాలు. ఒకప్పుడు `నా చెప్పును నిలబెట్టినా గెలుస్తుంది..` అంటూ (NTR)ఎన్టీఆర్ చేసిన `కామెంట్` ఆయన్ను అధికారానికి దూరం చేసింది. తాజాగా `నేను ఒక ఫెల్యూర్ పొలిటీషియన్`(failure politician) అంటూ పవన్ చేసిన వ్యాఖ్యలు జనసేన(janasena) భవిష్యత్ ను ప్రశ్నార్థం చేయనుందా? అంటే ఔనంటున్నారు రాజకీయ పండితులు.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సొంతంగా జనసేన పార్టీని పెట్టుకుని ఎనిమిదేళ్లు పూర్తి చేసుకున్నప్పటికీ దానికి ఇప్పటికీ గుర్తింపు లేదు. ఎన్నికల కమిషన్ ఆ పార్టీ గుర్తు `గ్లాస్` ను ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో స్వతంత్ర్య అభ్యర్థులకు కేటాయించిన విషయం విదితమే. అంటే, పార్టీ సింబల్ కూడా జనసేనకు ఈ ఎనిమిదేళ్లలో దక్కలేదు. దాని వెనుక కారణాలు లేకపోలేదు. తొలి రోజుల్లో పవన్ మాత్రమే ఆ పార్టీకి ఉన్నారు. ఆయన 2014 ఎన్నికల్లో బీజేపీ, టీడీపీకి మద్ధతు పలికారు. ఒక వ్యక్తిగా మాత్రమే బహిరంగ సభల్లో పాల్గొన్నారు. ఆనాటికి ఎలాంటి నిర్మాణం జనసేన పార్టీకి లేదు. కేంద్రం, రాష్ట్రంలో ఆయన మద్ధతు ఇచ్చిన బీజేపీ, టీడీపీ అధికారంలోకి రావడంతో జనసేన నిర్మాణం 2017 వరకు పెద్దగా జరగలేదు. పార్టీ సిద్ధాంత కర్తలుగా ఉన్న కొందరు మేధావులు ఆ పార్టీని వీడి వెళ్లిపోయారు. ఆ తరువాత పార్టీ నిర్మాణం చేయాలని పవన్ భావించారు. సంస్థాగత నిర్మాణం పూర్తిగా లేకుండా 2019 ఎన్నికలకు వెళ్లి అభాసుపాలయ్యారు.
జనసేన (janasena) సిద్ధాంతాలకు పవన్ వాలకానికి ఏ మాత్రం పొంతన లేకుండా ఎనిమిదేళ్ల నుంచి ఆ పార్టీ నడుస్తోంది. తొలి రోజుల్లో జేగువీర, కాన్షీరాం, చాకలి ఐలమ్మ తదితరుల భావజాలాన్ని వినిపించారు పవన్. 2019 ఎన్నికల తరువాత బీజేపీ సిద్ధాంతాన్ని అందుకున్నారు. ఒక్కసారిగా లెఫ్ట్ నుంచి రైట్ టర్న్ తీసుకున్నారు. ఇక `కులాల ప్రస్తావనలేని మతాలకు అతీత రాజకీయాలు` అనే సిద్ధాంతాన్ని అటకెక్కించారు. కాపు కులానికి చెందిన వాళ్లను జనసేన సంస్థాగత కీలక పదవుల్లో నింపేసి `కులాల ప్రస్తావనలేని` అనే నినాదాన్ని సమాధి చేశారని ఆ పార్టీని వీడిన మేధావులు ఎన్నోసార్లు చెప్పారు. బీజేపీతో చేతులు కలపడం ద్వారా `మతాలకు అతీతం` అనే స్లోగన్ కు శాశ్వతంగా పాతరవేశారు పవన్. ఇప్పుడు `ఒక్క ఛాన్స్` అంటూ ముందుకొస్తున్నారు. తొలి రోజుల్లో ప్రశ్నించడానికి జనసేన వస్తుందన్న పవన్ ఇప్పుడు రాజ్యాధికారం కావాలని `ఒక్క ఛాన్స్` అంటున్నారు.
Also Read AP Politics : జయహో బీసీ! బాబు, జగన్ జాతకాలు!!
రాజ్యాధికారం కావాలని ఏ రాజకీయపార్టీ అయినా కోరుకుంటుంది. కానీ, ఆ దిశగా పార్టీ సిద్ధాంతాలు ఉండాలి. వాటి కోసం ప్రజా క్షేత్రంలో యుద్ధం చేయాలి. కానీ, పవన్ ప్రజల మధ్యకు వెళ్లి సీరియస్ గా వాళ్ల పక్షాన నిలబడిన దాఖలాలు పెద్దగా లేవు. నాన్ సీరియస్ పొలిటీషియన్ గా ఆయనపై బలమైన ముద్ర ఉంది. షూటింగ్ గ్యాప్ లో నెలకో, రెండో నెలలకు ఒకసారి ముఖం చూపించే లీడర్ గా అపవాదును ఎదుర్కొంటున్నారు. దానికి తోడు సొంతంగా నిర్ణయాలు తీసుకోలేని బలహీనుడుగా బీజేపీ ఆయన్ను మార్చేసింది. రోడ్ మ్యాప్ కోసం ఎదురు చూస్తున్నానంటూ బీజేపీ అగ్రనేతల అడుగులో అడుగు వేస్తున్నారు. ఒకానొక సమయంలో జనసేన విలీనం కోసం బీజేపీ ఢిల్లీ పెద్దలు ఒత్తిడి తీసుకొస్తున్నారంటూ శ్రేణులకు సెలవిచ్చారు. దీంతో జరుగుతోన్న నష్టాన్ని గ్రహించి ప్రశ్నించడానికి జనసేన పార్టీని ప్రాణం ఉన్నంత వరకు విలీనం చేయనంటూ నష్ట నివారణకు ప్రయత్నం చేయడం గమనార్హం.
తాజాగా సీఏ విద్యార్థుల సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరయిన పవన్ ఇప్పటి వరకు `నేను ఫెయిల్యూర్ పొలిటిషియన్` (failure politician) అంటూ చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారాయి. ఇక ఆయన చేతులెత్తాశారని ప్రత్యర్థులు ప్రచారానికి దిగారు. సోషల్ మీడియా వేదికగా ఆయన వ్యాఖ్యలపై ట్రోల్స్ హోరెత్తు తున్నాయి. ఎన్నికలు సమీపిస్తోన్న టైమ్ లో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం జనసేనకు భారీ నష్టాన్ని తెస్తున్నాయని ఆ పార్టీ వర్గాల్లోని కొందరు అభిప్రాయం. వాస్తవంగా హాజరైన విద్యార్థుల మానసిక స్థైర్యాన్ని పెంచేందుకు స్వానుభవాన్ని ఉదహరించారు పవన్. కానీ, ఆ వ్యాఖ్యలు బూమ్ రాంగ్ కావడంతో సోషల్ మీడియా వేదికగా రాజకీయ జోకర్ గా పవన్ ఫోకస్ అవుతున్నారు. ఆయన వాడిన `ఒకే ఒక మాట` జనసేన భవిష్యత్ రాజకీయాన్ని ప్రశ్నార్థకం చేస్తోంది.