విజయవాడలో జనసేన జెండా దిమ్మె ధ్వంసంపై స్పందించారు ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్. పోలీసుల తీరుపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. తీరు మార్చుకోకుంటే తానే రోడ్డుక్కుతానని పోలీసులను హెచ్చరించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించకూడదనే తాను సంయమనం పాటిస్తున్నాన్నారు. జెండా దిమ్మెలు పగులగొట్టిన వైసీపీ నేతలపై కేసులు ఎందుకు నమోదు చేయడం లేదని ప్రశ్నించారు. పోతిన మహేశ్ ను అరెస్టు చేయడాన్ని ఖండిస్తున్నాన్నారు జనసేనాని. జెండా ఆవిష్కరణ కోసం జనసేన నాయకులపై కేసులు పెట్టడం ఎంత వరకు న్యాయమంటూ ప్రశ్నించారు.
పోలీస్ అధికారులు ఆలోచించాలన్నారు. పోలీసులు అధికార పార్టీకి వత్తాసు పలుకుతున్నారని భావిస్తున్నామన్నారు. పోలీసులు ధర్మాన్ని పాటించాలని పవన్ హితవు పలికారు. జనసేన ఉనికిని తీసిపారేయడం ఎవరి తరం కాదన్నారు. ప్రజలే పార్టీని కాపాడుకుంటారని పవన్ స్పష్టం చేశారు. పవన్ పుట్టిన రోజు సంరద్భంగా శుక్రవారం విజయవాడలో వన్ టౌన్ లోని రాయల్ హోటల్ దగ్గర జనసేన పార్టీ జెండా దిమ్మెను అలంకరించారు. అయితే దిమ్మె తమ పార్టీదంటూ వైసీపీ నేతలు అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ నెలకొంది. రంగంలోకి దిగిన పోలీసులు జనసేన కార్యకర్తలను తరమికొట్టడం వివాదస్పదంగా మారింది.