Janasena: ‘వైసీపీ’ విధానాలతోనే ‘విద్యుత్ సంక్షోభం’

అనాలోచిత విధానాలే ఆంధ్రప్రదేశ్ లో విద్యుత్ సంక్షోభానికి కారణమని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.

  • Written By:
  • Updated On - April 8, 2022 / 05:34 PM IST

వైసీపీ ప్రభుత్వ లోపభూయిష్ట నిర్ణయాలు, అనాలోచిత విధానాలే ఆంధ్రప్రదేశ్ లో విద్యుత్ సంక్షోభానికి కారణమని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. పల్లెల్లో 11 నుంచి 14 గంటలు, పట్టణాల్లో 5 నుంచి 8 గంటలు, నగరాల్లో 4 నుంచి 6 గంటలు చొప్పున అనధికార విద్యుత్ కోతలు విధించడంతో జనం అల్లాడిపోతున్నారని అన్నారు. మొబైల్ ఫోన్ లైట్ల వెలుగులో ఆస్పత్రుల్లో ఆపరేషన్లు, ప్రసవాలు జరగడం చూస్తుంటే రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం ఏ స్థాయిలో ఉందో అర్ధమవుతోందని పేర్కొన్నారు. శుక్రవారం హైదరాబాద్ లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో విద్యుత్ సంక్షోభంపై మాట్లాడారు.

పవన్ కళ్యాణ్ తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ “రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్ మిగులు విద్యుత్ రాష్ట్రంగా ఉండేది. దీంతో 2014 – 19 సమయంలో అప్పటి ప్రభుత్వ హయాంలో విద్యుత్ కోతల ప్రభావం పెద్దగా ఉండేది కాదు. ఒకటి రెండు సందర్భాలలో విద్యుత్ ఛార్జీలు పెంచినపుడు కడియం ప్రాంత రైతులు తన వద్దకు వచ్చి భారం మోయలేమంటూ గోడు వెళ్లబోసుకున్నారు. నేను ప్రభుత్వం దృష్టికి ప్రజల తరఫున ఈ విషయం తీసుకెళ్లినప్పుడు పెంచిన ఛార్జీలను ఉపసంహరించుకున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక గత ప్రభుత్వం చేసుకున్న పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లు (పి.పి.ఎ.) రద్దు చేసింది. యూనిట్ రూ. 4.80 చొప్పున 25 ఏళ్ల పాటు గ్రీన్ ఎనర్జీ కంపెనీలతో అప్పటి ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలను రద్దు చేసింది. యూనిట్ రెండు రూపాయలకే గ్రీన్ ఎనర్జీని తీసుకొస్తామని చెప్పింది. ఇప్పుడేమో కోల్ ఎనర్జీని రూ.20 పెట్టి కొంటోంది. ఇలాంటి లోపభూయిష్ట నిర్ణయాల వల్లే విద్యుత్ సంక్షోభం ఏర్పడిందని జగన్ సర్కార్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు జనసేనాని.

ఉచితం అని చెప్పి 57 శాతం ఛార్జీలు

అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తాం. అల్పాదాయ వర్గాలకు 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ ఇస్తామని హామీ ఇచ్చిన వైసీపీ నాయకత్వం, ఇవాళ 57 శాతం ఛార్జీలు పెంచింది. ఫ్యాను, రెండు లైట్లు, 15 గంటలు టీవీ చూసినా 150 యూనిట్లే ఖర్చు అవుతుందని, మరో 50 యూనిట్లు పెద్ద మనసుతో అదనంగా ఇస్తున్నామని చెప్పారు. ఇప్పుడు విద్యుత్ ఛార్జీలు భారీగా పెంచి ఇళ్లల్లో ఫ్యాన్లు వేసుకోకుండా చేశారని విమర్శించారు పవన్ కళ్యాణ్.

విద్యార్థులకెన్నో ఇక్కట్లు

విద్యార్థులు, పరీక్షలకు సన్నద్దమవుతున్న వారు కరెంట్ కోతలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పగలంతా తరగతి గదుల్లో ఉండి రాత్రిళ్లు ప్రశాంత నిద్ర లేక ఒత్తిడికి గురవుతున్నారు. ఇళ్లల్లో కరెంటు లేకపోవడంతో కొందరు రైల్వే స్టేషన్, బస్టాండుల్లో పడుకుంటున్నారు. పరిశ్రమలకు ఇప్పటికే వారాంతంలో ఒక రోజంతా విద్యుత్ కోతలు అమలు చేస్తున్నారు. తాజాగా మరో రోజు పవర్ హాలిడే ప్రకటించడంతో పరిశ్రమలు వారానికి రెండు రోజులు మూతపడనున్నాయి. అలాగే నిరంతరం పని చేసే పరిశ్రమలు ఇప్పుడు వాడుతున్న కరెంట్ లో ఇక 50 శాతం మాత్రమే వాడాలనే నిబంధన విధించింది. దీంతో కోట్లాది రూపాయలు పెట్టుబడి పెట్టిన పారిశ్రామికవేత్తలు విద్యుత్ కోతలతో నష్టాల పాలవుతున్నారు. పారిశ్రామిక అభివృద్ధికి విఘాతం కలుగుతుంది. 36 లక్షల మంది కార్మికుల ఉపాధిపై ప్రభావం పడే ప్రమాదం ఉందని తెలిపారు పవన్ కళ్యాణ్.

సహనాన్ని పరీక్షించకండి

వ్యక్తిగత అజెండాతో జనసేన పార్టీని స్థాపించలేదు. ప్రజలు బాగుండాలి, వారిని పల్లకీ ఎక్కించాలనే ఉద్దేశంతోనే పార్టీని ప్రారంభించాను. భవన నిర్మాణ కార్మికుల సమస్యల నుంచి పెరిగిన విద్యుత్ ఛార్జీల వరకు ప్రజల పక్షానే పోరాటం చేస్తున్నాం. ఉద్యోగులు రోడ్డెక్కడానికి, కౌలు రైతుల ఆత్మహత్యలకు కారణం మేము కాదు.. మీ విధానాలే. మేము ప్రభుత్వ విధానాలు, పాలసీల గురించి మాట్లాడితే నన్ను వ్యక్తిగతంగా రాక్షసుడు, దుర్మార్గుడు అని దూషిస్తున్నారు. మీరు వ్యక్తిగతంగా దూషణలకు దిగితే వాటిని ఎలా ఎదుర్కోవాలో నాకు బాగా తెలుసు. మీరు నోటికి వచ్చినట్లు మాట్లాడి మా సహనాన్ని పరీక్షించ వద్దు. పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ల రద్దు నుంచి పరిశ్రమలకు పవర్ హాలీడే ప్రకటించే వరకు వైసీపీ అనాలోచిత విధానాలతో ప్రజలను ఎలా మోసం చేస్తున్నారో ప్రతి ఒక్క జన సైనికుడు, వీరమహిళ ప్రజల్లోకి తీసుకెళ్లాలి” అన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.