Pawan Kalyan: జనసేన ఈసారి బలిపశువు కాదు.. ప్యాకేజీ అంటే చెప్పుతో కొడతా: జనసేన అధినేత పవన్ కల్యాణ్

కృష్ణా జిల్లా మచిలీపట్నంలో జరిగిన జనసేన (Jana Sena) ఆవిర్భావ సభలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కీలక వ్యాఖ్యలు చేశారు.

  • Written By:
  • Publish Date - March 15, 2023 / 06:25 AM IST

కృష్ణా జిల్లా మచిలీపట్నంలో జరిగిన జనసేన (Jana Sena) ఆవిర్భావ సభలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కీలక వ్యాఖ్యలు చేశారు. జనసేన 10వ ఆవిర్భావ సభలో పవన్‌కల్యాణ్ మాట్లాడుతూ.. పదేళ్ల కిందట నేను పార్టీ పెట్టినప్పుడు నా వెనుక ఎవరూ లేరు. అప్పుడు నాకు రాజకీయాలు అంటే ఏంటో తెలియదు. సగటు మనిషికి మేలు చేయాలనే పార్టీ పెట్టా. ఎన్ని అడ్డంగులు ఎదురైనా వెనకడుగు వేయలేదు. నాకు పింగళి వెంకయ్య స్ఫూర్తి. సమాజం కోసం ఏదైనా చేద్దామనే రాజకీయాల్లోకి వచ్చా అని అన్నారు.

వైసీపీ ప్రభుత్వం కులాలను విడదీసే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. వైసీపీ కుల కార్పొరేషన్లు ప్రారంభించిందన్నారు. ఏపీలో ఒక్క కులం పెత్తనం ఆగిపోవాలని మండిపడ్డారు. కాపు కులంలో పుట్టినా అందరికీ అండగా నిలవాలన్నది తన ప్రయత్నమన్నారు. తాను కులాన్ని అమ్మేస్తానని అంటుంటే బాధేస్తుందని పేర్కొన్నారు. నాకు తెలంగాణ సీఎం వెయ్యి కోట్లు ఆఫర్ చేశారని ప్రచారం చేస్తున్నారు. నేను డబ్బులకు ఆశపడే వ్యక్తిని కాదు. నేను ఇప్పుడు చేస్తున్న సినిమాకు రోజుకు రూ. 2 కోట్లు తీసుకుంటున్నా. అంటే సినిమాకు రూ. 45 కోట్లు వస్తాయి. ఇంకోసారి ప్యాకేజీ అంటే చెప్పుతో కొడతా అని మండిపడ్డారు.

Also Read: KCR: మహారాష్ట్రలో మరో సభకు ప్లాన్ చేస్తోన్న కేసీఆర్… ఈ సారి అక్కడే ఇక !

వైసీపీ ప్రభుత్వంపై పవన్‌కల్యాణ్ మండిపడ్డారు. మద్యపాన నిషేధమని రాష్ట్రంలో విచ్చలవిడిగా మద్యం అమ్ముతున్నారని విమర్శించారు. అక్రమ సంపాదన అంతా ప్రజల్ని కొనేందుకే వాడుతున్నారని దుయ్యబట్టారు. ఆరోగ్యాన్ని దెబ్బతీయని మద్యాన్ని అమ్మాలన్నదే మా విధానం. కానీ, రాష్ట్రంలో కల్తీ మద్యం అమ్ముతున్నారన్నారు. గంజాయి మత్తులో ఏపీ తూగుతోందన్నారు. బీజేపీతో పొత్తు అంటే ముస్లింలు తనకు దూరమవుతారని అంటున్నారని.. వారికి ఇష్టం లేకపోతే తాను బీజేపీ నుంచి బయటకు వస్తానని పవన్‌కల్యాణ్ చెప్పారు. ముస్లిం సమాజం జగన్‌ను నమ్ముతుంది. జగన్ ఢిల్లీ వెళ్లి ఏం చేస్తారో నాకు తెలుసు. బీజేపీకి జగన్ ఎలా సపోర్ట్ చేస్తారు? ముస్లిం సమాజం వారిని ఎందుకు ప్రశ్నించదు అని పేర్కొన్నారు.

అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో గెలుస్తామ‌ని ప్ర‌జ‌లు విశ్వ‌సిస్తే, అనుకూల స‌ర్వేలు వ‌స్తే జ‌న‌సేన ఒంట‌రిగా పోటీ చేసి గెలుస్తుంద‌ని ప‌వ‌న్‌క‌ల్యాణ్ అన్నారు. ఈసారి జనసేన బలిపశువు కాదు. నాతో సహా అభ్యర్థులందరూ గెలుస్తారు. మాకు అండగా నిలిస్తే.. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తాం. వచ్చే ఎన్నికల్లో జనసేన సత్తా చాటుతుంది అని చెప్పారు. సభ ప్రారంభంలో ఏపీలో ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు జనసేనాని పవన్ కల్యాణ్ చెక్కులను పంపిణీ చేశారు. ఒక్కొక్కరికి రూ. లక్ష చొప్పున అందించారు. మొత్తం 47 కుటుంబాలకు పవన్ సాయం చేశారు.