ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ ఉత్సాహం నింపే పరిణామం చోటు చేసుకోబోతోంది. 2024 ఎన్నికల్లో అధికారాన్ని కోల్పోయిన వైసీపీ, తిరిగి ప్రజల మనసులు గెలుచుకోవడానికి మళ్లీ పాదయాత్ర పథకాన్ని సిద్ధం చేస్తోంది. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం బెంగళూరులో ఎక్కువ కాలం గడిపినా, 2027లో మరోసారి ప్రజల్లోకి వచ్చి భారీ స్థాయిలో పాదయాత్ర చేయాలని నిర్ణయించుకున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 2017లో ప్రారంభమైన ప్రజా సంకల్ప యాత్ర రాష్ట్ర రాజకీయాలను మార్గనిర్దేశం చేసినట్లే, ఈ కొత్త యాత్ర కూడా వైసీపీకి పునరుజ్జీవన శక్తిగా మారనుందని నేతలు విశ్వసిస్తున్నారు. ఈ విషయాన్ని మాజీ మంత్రి పేర్ని నాని తాజాగా బహిరంగంగా ప్రకటించడం రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది.
PAN- Aadhaar: పాన్ కార్డు ఉన్నవారికి బిగ్ అలర్ట్.. డిసెంబర్ 31 వరకే ఛాన్స్!
పేర్ని నాని వివరాల ప్రకారం, ఈ ‘నయా ప్రజా సంకల్ప యాత్ర’ 2027లో ప్రారంభమై 2029 అసెంబ్లీ ఎన్నికల వరకు సాగే అవకాశం ఉంది. అంటే దాదాపు రెండు సంవత్సరాల పాటు జగన్ నేరుగా ప్రజల్లో ఉంటారు. ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలను తెలుసుకోవడం, ప్రస్తుత కూటమి ప్రభుత్వ వైఫల్యాలను బహిర్గతం చేయడం, అలాగే వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తే చేపట్టబోయే కార్యక్రమాలపై అవగాహన కల్పించడమే ఈ యాత్ర ప్రధాన లక్ష్యం. 2017లో చేసిన పాదయాత్ర ప్రజలలో జగన్కి సానుభూతి, నమ్మకం తెచ్చిపెట్టినట్లే, ఈ సారి కూడా అదే ఉత్సాహాన్ని పునరుద్ధరించడమే పార్టీ ధ్యేయం. నాని మాట్లాడుతూ “నాడు జగన్ ఇచ్చిన హామీలను మాత్రమే కాకుండా, చెప్పని వాటిని కూడా ఆయన అమలు చేశారు. అందుకే ఇప్పటికీ ప్రజలు ఆయనను గుర్తు చేసుకుంటున్నారు” అని వ్యాఖ్యానించారు.
మరోవైపు, నాని కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. “ప్రజలకు ఇచ్చిన హామీలను మరచిపోయి, రాజకీయ కక్షసాధింపులకే కూటమి పరిమితమైందని, వైసీపీ నేతలను అరెస్ట్ చేయడం తప్ప ప్రజా సంక్షేమం పట్టించుకోవడం లేదని” ఆయన విమర్శించారు. జగన్ పాదయాత్ర ప్రజల్లో నమ్మకం, స్పూర్తి నింపుతుందని, ప్రజలు మళ్లీ వైసీపీని కోరుకుంటున్నారని పేర్కొన్నారు. రాజకీయ విశ్లేషకుల అంచనాల ప్రకారం, ఈ పాదయాత్ర వైసీపీకి కొత్త ఊపునిచ్చే అవకాశం ఉంది. జగన్ మళ్లీ ప్రజల్లోకి అడుగుపెట్టడం, పార్టీకి సరికొత్త శక్తి, ప్రజల్లో కొత్త విశ్వాసం తెచ్చే అవకాశముందని వారు అభిప్రాయపడుతున్నారు. 2027లో ప్రారంభమయ్యే ఈ యాత్ర ఆంధ్రప్రదేశ్ రాజకీయ పటంలో కీలక మలుపు కావచ్చని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
