ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర రాజకీయాల్లో మళ్లీ వేడి పుట్టించారు. వచ్చే ఏడాది జూలై నుంచి తాను పాదయాత్ర ప్రారంభించబోతున్నట్లు ఆయన స్పష్టమైన ప్రకటన చేశారు. గతంలో అనుకున్న సమయం కంటే ముందే ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల కంటే మెరుగ్గా చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు, ప్రస్తుతం ఉన్న పథకాలను కూడా అటకెక్కించారని ఆరోపించారు. తన హయాంలో రూ. 2.73 లక్షల కోట్లు నేరుగా పేదల ఖాతాల్లోకి చేరాయని, ఇప్పుడు ఆ నిధులు ఎటు వెళ్తున్నాయని ఆయన ప్రశ్నించారు.
మావిగన్ ప్రతిపాదన: అమరావతి అవినీతిపై జగన్ ధ్వజం
రాజధాని విషయంలో జగన్ ప్రతిపాదించిన ‘మావిగన్’ (MAVIGAN) అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అమరావతికి తాము వ్యతిరేకం కాదని, అయితే అక్కడ జరుగుతున్న భారీ అవినీతిని ప్రశ్నిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. రాజధాని నిర్మాణాల పేరుతో కూటమి నేతలు కమీషన్లు దండుకుంటున్నారని ఆరోపించారు. మూడు రాజధానుల ప్రతిపాదన ఆమోదం పొందని పక్షంలో, 120 కిలోమీటర్ల రాజధాని కారిడార్గా ‘మావిగన్’ను పరిశీలించాలని సూచించామన్నారు. దీనిపై సరైన అవగాహన లేకుండానే విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. కేవలం అమరావతి పేరు చెప్పి చంద్రబాబు ప్రజలను, రైతులను మోసం చేస్తూ రాష్ట్రానికి శాశ్వత రాజధాని లేకుండా చేస్తున్నారని జగన్ విమర్శించారు.
మహిళా భద్రత మరియు లిక్కర్ మాఫియాపై ఫైర్
రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని, ముఖ్యంగా మహిళలకు భద్రత లేకుండా పోయిందని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఒక ప్రముఖ పత్రికాధిపతి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ, ఆ వ్యాఖ్యలను చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ ఎలా సమర్థిస్తారని ప్రశ్నించారు. కూటమి నేతలే మహిళలపై వేధింపులకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రవ్యాప్తంగా లిక్కర్ మాఫియా రాజ్యమేలుతోందని, బెల్టు షాపులు ఊరూరా దర్శనమిస్తున్నాయని విమర్శించారు. రాష్ట్ర అభివృద్ధిని పక్కన పెట్టి, కేవలం ‘దోచుకో-దాచుకో’ అన్న చందంగా ప్రభుత్వం సాగుతోందని జగన్ దుయ్యబట్టారు.
