ప్రస్తుతం వైవీ సుబ్బారెడ్డి (TTD) చైర్మన్ గా ఉంటూ ఉత్తరాంధ్ర వైసీపీ బాధ్యతలను చూస్తున్నారు. జోడు పదవుల ఒత్తిడి ఎక్కువగా ఆయనకు ఉంది. పైగా ఆయన టర్మ్ కూడా దగ్గరపడింది. అంతేకాదు, ఒంగోలు ఎంపీగా ఈసారి పోటీ చేయాలని వైవీ సుబ్బారెడ్డి భావిస్తున్నారు. చాలా ఏళ్లుగా ఆయన ప్రత్యక్ష ఎన్నికల్లోకి దిగాలని ప్రయత్నించారు. కానీ, ఆ అవకాశం ఇప్పటి వరకు ఆయన రాలేదు. గతంలో 2014, 2019 ఎన్నికల్లో ఒంగోలు ఎంపీగా రంగంలోకి దిగడానికి ప్రయత్నం చేశారు. కానీ, అక్కడ ఎమ్మెల్మే బాలినేని శ్రీనివాసుల రెడ్డి చక్రం తిప్పడంతో కుదరలేదు. ఇప్పుడు ఆయన గ్రాఫ్ దారుణంగా పడిపోయిందని సర్వేల సారాంశం. అందుకే, ఈసారి ఒంగోలు ఎంపీగా వైవీని దింపాలని వైసీపీ ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో టీటీడీ(TTD) చైర్మన్ స్థానంలో కరుణాకర్ రెడ్డిని తిరుమల తిరుపతి చైర్మన్ గా నియమించాలని జగన్మోహన్ రెడ్డి నిర్ణయం(Jagan Strategy) తీసుకున్నారని తెలుస్తోంది.
కడప జిల్లాకు చెందిన `రెడ్డి` సామాజికవర్గానికి మరో కీలక పదవి దక్కనుంది. తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి చైర్మన్ గా భూమన కరుణాకర్ రెడ్డిని నియమించడానికి సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రాథమికంగా (Jagan Strategy) నిర్ణయించాలని న్యూస్ చక్కర్లు కొడుతోంది. అదే నిజమైతే, ప్రస్తుత సీఎం జగన్మోహన్ రెడ్డి , ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి, డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి తదితరుల కడప జాబితాలో కరుణాకర్ రెడ్డి కూడా చేరబోతున్నారు. ఇటీవల తిరుపతి కేంద్రంగా జరిగిన రాయలసీమ గర్జన్ విజయవంతం చేసిన ఆయనకు గిఫ్ట్ గా టీటీడీ చైర్మన్ పదవి దక్కనుందని వైసీపీ వర్గాల్లోని టాక్.
Also Read : Tirumala Darshan Tickets : డిసెంబర్ 24న వైకుంఠ ద్వార దర్శనం టికెట్లు విడుదల
అభ్యుదయ భావాలు కలిగిన భూమన కరుణాకర్ రెడ్డి స్వస్థలం కడప జిల్లా,నందలూరు మండలం, ఈదరపల్లె. అక్కడే ఆయన జన్మించారు. ఎస్.వి. యూనివర్సిటీ నుండి బీఏ., ఎం.ఏ పట్టాలను అందుకున్నారు. 2019 ఎన్నికల్లో తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఆయన 2006 నుండి 2008 వరకు టీటీడీ చైర్మన్గా కొనసాగారు. ఆ సమయంలో శ్రీవారి కల్యాణాన్ని తిరుమలను దాటించారు. తొలుత కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చాడు. వైఎస్ రాజారెడ్డికి జైల్లో పరిచయమైన ఆయన ఆ కుటుంబానికి నమ్మినబంటుగా ఉన్నారు. వై.యస్. రాజశేఖరరెడ్డికి అత్యంత సన్నిహితునిగా మెలిగాడు. 2004 ఎన్నికల ముందు రాజశేఖర్ రెడ్డి చేసిన పాదయాత్రను భూమన దగ్గరుండి పర్యవేక్షించారు. 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం అధ్యక్షుడు మెగాస్టార్ చిరంజీవి మీద కాంగ్రెస్ అభ్యర్థిగా తిరుపతి నుంచి పోటీ చేసి ఓడిపోయాడు. తొలిసారి వై.యస్. రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయినా తరువాత 2004 నుండి 2006 వరకు తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ (తుడా) చైర్మన్గా నియమితులయ్యారు. ఆ తరువాత 2006 నుండి 2008 వరకు టీటీడీ చైర్మన్గా పని చేశారు.
వై.యస్ మరణాంతరం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి 2011లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి 2012లో జరిగిన ఉప ఎన్నికలో తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. 2014లో ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. తిరిగి 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ తిరుపతి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో అవకాశం కోసం ప్రయత్నించినప్పటికీ అవకాశం లభించలేదు. అయితే, 2021లో టీటీడీ పాలకమండలి ప్రత్యేక ఆహ్వానితుడిగా నియమితులయ్యారు. ప్రస్తుత టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డికి రెండోసారి చైర్మన్ పదవిని ఇచ్చినప్పుడే కరుణాకర్ రెడ్డి ఆ పదవిని ఆశించారు.
Also Read : TTD Calendars : అమ్మకానికి టీటీడీ క్యాలెండర్లు, డైరీలు