ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి (Jagan) మీద పరోక్షంగా మంత్రి కేటీఆర్ (KTR) రెచ్చిపోయారు. ప్రగతి నిరోధకునిగా జగన్మోహన్ రెడ్డిని పోల్చారు. అంతర్జాతీయ ప్రమాణాలతో నడుస్తోన్న అమరరాజా (Amara Raja) కంపెనీ మీద ఏపీ ప్రభుత్వం సృష్టించిన అపోహలను కడిగిపారేశారు. చిల్లరమల్లర రాజకీయాలు చేస్తూ కంపెనీలను రాకుండా చేయొద్దని గడ్డిపెట్టారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పోటీని దృష్టిలో ఉంచుకుని ప్రతి వేదికపైనా పెట్టుబడులు వచ్చేలా ప్రయత్నం చేయాలని జగన్మోహన్ రెడ్డికి పరోక్షంగా చురకలు వేశారు. చిత్తూరు జిల్లాలో ఉండే ప్లాంట్ కాలుష్య రహితమని తేల్చేశారు. జీరో లిక్విడ్ డిశ్చార్జ్ తో నడుస్తోన్న అంతర్జాతీయ ప్రమాణాలున్న కంపెనీగా అమరరాజా గురించి జగన్మోహన్ రెడ్డికి తెలిసిసొచ్చేలా మొఖం మీద కొట్టినట్టు వివరించారు.
ఉద్యమ నాయకునిగా ఉన్నప్పుడు ఆంధ్రోళ్లు దోపిడీదారులు అంటూ ప్రచారం చేసిన కల్వకుంట్ల కుటుంబం ఇప్పుడు వాస్తవాలను మాట్లాడుతున్నారు. పైగా గ్లోబల్ గా ఉన్న పరిస్థితులను అధ్యయనం చేస్తూ చంద్రబాబు వేసిన విజన్ మీద అభివృద్ధిని పరుగు పెట్టిస్తున్నారు. అదే సందర్భంలో ఏపీ ప్రగతిని కూడా కోరుకుంటూ జగన్మోహన్ రెడ్డి వైఖరిని అప్పడప్పుడు ఎత్తిచూపుతున్నారు. అమరావతి ప్రాజెక్టు సక్సెస్ అయితే , ప్రపంచ నగరం అయ్యేదని ఇటీవల మంత్రి కేటీఆర్ అన్నారు. ఆ ప్రాజెక్టు కుప్పకూలినందున హైదరాబాద్ అంతర్జాతీయంగా నెంబర్ 1 స్థానానికి ఎదగడానికి అవకాశం వచ్చిందని పరోక్షంగా జగన్మోహన్ రెడ్డి అజ్ఞాన్ని ఎత్తిపొడిచారు.
అసెంబ్లీ వేదికగా సీఎం కేసీఆర్ కూడా ఏపీ పరిస్థితిని చక్కగా చెప్పారు. ఒకప్పుడు ఏపీలో ఒక ఎకరం అమ్ముకుంటే తెలంగాణాలో మూడు ఎకరాలు వచ్చేంది. ఇప్పుడు తెలంగాణలో ఒక ఎకరం అమ్ముకుంటే ఏపీలో పది ఎకరాలు వస్తుందని వెల్లడించారు. అంటే, జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తరువాత ఏపీ పరిస్థితి ఏమిటో అప్పుడప్పుడు ఉద్యమ నాయకులు చెప్పడం వైసీపీ నేతలకు చెవికి ఎక్కడంలేదు. సీఎంగా చంద్రబాబు ఉన్నప్పుడు పలు కంపెనీలతో ఒప్పందాలు చేసుకున్నారు. తీరా, ఆ కంపెనీలు పెట్టుబడులు పెట్టేనాటికి జగన్మోహన్ రెడ్డి (Jagan-KTR) సీఎం అయ్యారు. దీంతో ఆ ఒప్పందాలన్నీ ఇప్పుడు తెలంగాణ వైపు మళ్లాయి. పారిశ్రామికీకరణ పరుగుపెడుతోంది. ఫలితంగా తెలంగాణ కళకళ లాడుతుంటే, ఏపీ వెలవెల బోతోంది.
విదేశీ, స్వదేశీ పెట్టుబడులు దేవుడెరుగు, స్థానికంగా ఉండే కంపెనీలను కూడా బద్నాం చేయడం వైసీపీ సర్కార్ కు అలవాటుగా మారింది. ఆ తరహా బద్నాంను అమరరాజా(Amara Raja) కంపెనీ ఎదుర్కొంది. జీరో కాలుష్యంతో నడిచే కంపెనీకి పొల్యూషన్ బోర్డుతో నోటీసులు జారీ చేయించింది. యాజమాన్యాన్ని వేధింపులకు గురి చేసింది. లేదంటే, ఆ కంపెనీ విస్తరణ ఏపీలోనే జరిగి ఉండేది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి (Jagan) వాలకంతో విసిగిపోయిన అమరరాజా కంపెనీ యాజమాన్యాన్ని మంత్రి కేటీఆర్ ఆకర్షించారు. వేలాది మందికి ఉద్యోగాలు ఇచ్చేలా 9వేలా 500 కోట్లు విలువైన పెట్టుబడులు పెట్టేలా ఒప్పందం కుదుర్చుకుని భూమి పూజలు చేయడం గమనార్హం.
Also Read : Amar Raja : ఔను! ఏపీ వేధిస్తే తెలంగాణ ప్రేమించింది.!
ఇండియాలోనే అతి పెద్ద బ్యాటరీ తయారీ కంపెనీ అమరరాజా (Amar Raja) యూనిట్ మహబూబ్ నగర్లో రావడాన్ని వైసీపీ లీడర్లు చిల్లరగా మాట్లాతారని ముందుగానే తెలంగాణ ప్రజల్ని కేటీఆర్ అప్రమత్తం చేశారు. ఏదైనా డౌట్ ఉంటే ప్రత్యేకంగా బస్సులు వేసుకుని చిత్తూరు వెళ్లి అమరరాజా కంపెనీ నిర్వహణను స్వయంగా చూడొచ్చని మంత్రి కేటీఆర్ చెప్పారు. అంటే, క్లీన్ సర్టిఫికేట్ మంత్రి కేటీఆర్ ఇవ్వగా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మాత్రం ఆ కంపెనీ కాలుష్యంతో కూడుకున్నదని చెబుతున్నారు. సరిగ్గా ఇక్కడే ప్రగతి నిరోధకుడు జగన్మోహన్ రెడ్డి అంటూ పరోక్షంగా చివాట్లు పెట్టారు మంత్రి కేటీఆర్. అమరరాజా 35 ఏళ్ల గొప్పతనాన్ని కొనియాడుతూ ఎంపీ గల్లా జయదేవ్ తండ్రి రాజగోపాల్ నాయుడు ఎంతో నిజాయితీగా కంపెనీ నడుపుతున్నారని ప్రశంసించారు. ఎనిమిది రాష్ట్రాలు పోటీపడినప్పటికీ తెలంగాణలో అమరరాజా 2.0ను విస్తరింప చేయడాన్ని మంత్రి కేటీఆర్ కొనియాడారు. ఇలాంటి ప్రశంసలు విన్న సీఎం జగన్మోహన్ రెడ్డి అండ్ టీమ్ ప్రతిగా స్పందిస్తారని ముందుగానే వాళ్లకు చివాట్లు పెడుతూ కేటీఆర్ తన ప్రసంగాన్ని ముగించారు.
Also Read : Amara Raja తో ఉద్యోగాల జాతర, 4500 మందికి ఉపాధి!