ఉద్యోగ సంఘాల మీద పట్టు సాధించిన సీఎంగా జగన్మోహన్ రెడ్డికి (Jagan CPS) గుర్తింపు వచ్చింది. గతంలో ఎప్పూడూ ఏ ముఖ్యమంత్రి అదుపుచేయని విధంగా ఉద్యోగులను గాడిలో పెట్టారు. ఉద్యమాలు, ఆందోళనలు, వార్నింగ్ లు లేకుండా సైలెంట్ గా పనిచేసుకుని వెళుతున్నారు. ఎన్నికల వేళ ఎప్పుడూ పీఆర్సీ, డీఏలు, టీఏలు అంటూ పలు సమస్యలతో ఉద్యోగులు రోడ్డెక్కిన సందర్భాలు అనేకం. ఇప్పుడు సీపీఎస్ బదులుగా జీపీఎస్ ఇస్తామని వేలాది మంది ఉద్యోగుల ఎదుట ధైర్యంగా జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. అయినప్పటికీ తేలుకుట్టినట్టు ఉద్యోగులు ఉండిపోయేలా జగన్మోహన్ రెడ్డి చేయడం గమనార్హం.
ఏపీ ఎన్జీవో 21వ రాష్ట్ర మహాసభలకు సోమవారం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హాజరయ్యారు. ఉద్యోగుల సంక్షేమం కోసం తీసుకున్న నిర్ణయాలను గుర్తు చేస్తూ ప్రసంగించారు. ఉద్యోగులకు రెండు డీఏలు బకాయి ఉండగా, జూలై 2022 డీఏను దసరా నాటికి విడుదల చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. దీంతో సంబురాలు జరుపుకునే స్థితికి ఉద్యోగులు వెళ్లారు. ఉద్యోగుల సంఘాల నేతల మధ్య ప్రచ్ఛన్నయుద్ధం నడిచేలా చేసిన జగన్మోహన్ రెడ్డికి ఎన్డీవో నేతలు హారతులు పట్టారు. ఆయన చెప్పిన జీపీఎస్ ను (Jagan CPS) అంగీకరిస్తూ మౌనంగా విన్నారు. 2019 ఎన్నికల సందర్భంగా జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీని అడిగేందుకు ఎవరూ ముందుకు రాకపోవడం విచిత్రం.
ప్రభుత్వాలను పడగొడతాం, నిలబెడతాం అంటూ బీరాలు పలికిన ఉద్యోగ సంఘాల నేతలు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి (Jagan CPS)పంచన చేరారు. కేవలం ప్రభుత్వం ఉద్యోగుల సంఘం నేత సూర్యనారాయణ మినహా మిగిలిన వాళ్లు ఏకమయ్యారు. ఆయన మీద జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కేసులు పెట్టింది. ఆస్తుల మీద దాడులు నిర్వహించింది. ప్రతి నెలా జీతాలు ఇస్తే చాలని కోరుతూ గవర్నర్ ను కలిసినందుకు ఆయన మీద వేటు వేశారు. ఆ రోజు నుంచి సూర్యనారాయణ లోపాలను తవ్వుతూ కేసులు పెట్టారు. ఉద్యోగం లేకుండా వేటాడారు. ప్రస్తుతం ఎస్కేప్ లో ఆయన ఉన్నారు. ఇక బండి శ్రీనివాసరావు, బొప్పరాజు వెంకటేశ్వర్లు ప్రభుత్వంతో కలిసి నడుస్తున్నారు.
Also Read : Employees Fight : వై నాట్ CPS దిశగా ఉద్యోగుల ఉద్యమబాట
ప్రభుత్వం ఏర్పడిన రెండో ఏడాది పెద్ద ఎత్తున సీపీఎస్ రద్దు కోసం ఉద్యోగులు ఉద్యమానికి దిగారు. కొన్ని లక్షల మంది ఉద్యోగులు విజయవాడను చుట్టుముట్టారు. ఆ రోజున జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వణికిపోయింది. ఆ తరువాత ఉద్యోగ సంఘాల నేతలకు జగన్మోహన్ రెడ్డి చుక్కలు చూపించారు. రోడ్డెక్కిన ఉద్యోగులను అదుపుచేయలేని కారణంగా ఆనాడున్న డీజీపీ గౌతమ్ సవాంగ్ మీద వేటు పడింది. ఆయన స్థానంలో కడప జిల్లాకు చెందిన రాజేంద్రనాథ్ రెడ్డి డీజీపీగా బాధ్యతలు స్వీకరించారు. ఇక అంతే, ఉద్యోగ సంఘాల నేతల మీద కేసులు పెడుతూ వచ్చారు. యాక్టివ్ గా ఆందోళనకు దిగే ఉద్యోగులను గుర్తించారు. వాళ్లను కిక్కురుమనకుండా చేయగలిగారు.
Also Read : Abandonment of ‘CPS’: జగన్ కు పంజాబ్ దెబ్బ
ఇటీవల విద్యుత్ ఉద్యోగులు రోడ్డు మీదకు వచ్చారు. రెండు రోజులు మాత్రమే వాళ్లు ఆందోళన చేయగలిగారు. వాళ్లను కూడా చీల్చి చెండాడారు. దీంతో ఆందోళన తాత్కాలికంగా విరమించారు. ఆ సమయంలో సీపీఎస్ రద్దు అంశం మరోసారి తెరమీదకు వచ్చింది. కానీ, దాని కోసం ఉద్యమించే ధైర్యం ఏ ఉద్యోగికి లేకుండా జగన్మోహన్ రెడ్డి చేయగలిగారు. ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వం అంటూ జీపీఎస్ ను పరిచయం చేశారు. ఆ విషయాన్ని కొన్ని వేల మంది ఉద్యోగులు పాల్గొన్న సభలోనే జగన్మోహన్ రెడ్డి చెప్పడం ఆయన చాకచక్యానికి నిదర్శనం. సీపీఎస్ రద్దు కుదరదని తేల్చేశారు. క్యాబినెట్ సబ్ కమిటీ ఇచ్చిన సిఫారస్సుల మేరకు జీపీఎస్ ను అమలు చేస్తున్నామని బాహాటంగా ప్రకటించడం కొసమెరుపు.