Jagan Cabinet Inside : ఏపీ క్యాబినెట్ సమావేశం ముగిసింది. ముందస్తు దిశగా ఆలోచన ఉన్నట్టు సంకేతాలు జగన్మోహన్ రెడ్డి ఇచ్చినట్టు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఆదేశం మేరకు ముందుకెళ్లాలని సూచాయగా చెప్పినట్టు సమాచారం. అసెంబ్లీ సమావేశాలు గురువారం నుంచి ప్రారంభం కానున్న దృష్ట్యా మంత్రివర్గం సమావేశాన్ని జగన్మోహన్ రెడ్డి బుధవారం నిర్వహించారు. ముందస్తు ఎన్నికల దిశగా ఆలోచన ఉందన్న సంకేతం ఇవ్వడం రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది. విపక్షాలు సర్వం సిద్ధం చేసుకునేలోగా ఎన్నికలకు వెళ్లాలన్న ఆలోచన ప్రభుత్వంలో కనిపిస్తోందని సర్వత్రా వినిపిస్తోంది.
ప్రస్తుతం ప్రతిపక్ష నేత చంద్రబాబు జైలులో ఉన్నారు. ఆయన ఇప్పట్లో బయటకు వచ్చే అవకాశం లేదని వైసీపీ వర్గాల్లోని టాక్. ఒక వేళ జైలు నుంచి బయటకు వచ్చినప్పటికీ ఇతరత్రా కేసుల్లో లోపలకు పంపేలా ప్లాన్ చేసినట్టు సర్వత్రా వినిపిస్తోంది. అంతేకాదు, లోకేష్ ను కూడా ఫైబర నెట్ కేసులో అరెస్ట్ చేయడానికి అవకాశం ఉంది. ఆ మేరకు వైసీపీ నేతలు ప్రతి వేదికపైనా వెల్లడిస్తున్నారు. మాజీ మంత్రులు దేవినేని ఉమా మహేశ్వరరావు, ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెంనాయుడును జైలుకు పంపడానికి రంగం సిద్దంం అవుతోంది. ఫలితంగా ప్రధాన ప్రతిపక్షాన్ని చాలా వరకు బలహీనపడేందుకు (Jagan Cabinet Inside) ఛాన్స్ ఉందని వైసీపీ అంచనా వేస్తోంది.
ఏపీలో జరిగిన నాలుగేళ్ల పాలన మీద ప్రస్తుతం డిస్కషన్ లేదు. కేవలం చంద్రబాబు అరెస్ట్, జైలు గురించి మాట్లాడుకుంటున్నారు. ఇదే ఒరవడిని కంటిన్యూ చేస్తూ వెళితే, మరో ఛాన్స్ కొట్టేయొచ్చని జగన్మోహన్ రెడ్డి అండ్ టీమ్ ఆలోచనగా తాడేపల్లి వర్గాల్లోని టాక్. పొత్తులపై ఒక క్లారిటీ వచ్చినప్పటికీ బీజేపీ పరిస్థితి ఏమిటి? అనేది ఇంకా స్పష్టత రాలేదు. ఆ పార్టీని కూడా కలుపుకుని వెళ్లాలని పవన్ భావిస్తున్నారు. ఒక వేళ మూడు పార్టీలు కూటమిగా ఏర్పడి ఎన్నికలకు వెళితే, సీట్ల సర్దుబాటు పెద్ద సమస్య. అప్పుడు టీడీపీలో అంతర్గతంగా కొన్ని ఇబ్బందులు వస్తాయి. ఇవన్నీ సరిచేసుకునే సమయం కూడా ఉండదు. జైలు జీవితాలతో టీడీపీ అగ్రనేతల మానసిక స్థితిని దెబ్బతీస్తూ, ఆర్థికంగా మరింత బలహీనపరచాలని వైసీపీ (Jagan Cabinet Inside) అంతిమ టార్గెట్ గా ఉందని సర్వత్రా వినిపిస్తోంది.
Also Read : Vishal : చంద్రబాబు అరెస్ట్ చాలా బాధాకరం..!: విశాల్
విపక్షాలు మేలుకొనేలోపు ఎన్నికలను ముగించాలని జగన్మోహన్ రెడ్డి దూకుడుగా ఉన్నారు. ఏడాది నుంచి ముందస్తు సంకేతాలు వినిపిస్తున్నాయి. ఎప్పుడు ఢిల్లీ వెళ్లినప్పటికీ ముందస్తు వ్యవహారం తెరమీదకు వస్తుంది. తెలంగాణతో కలిసి ఎన్నికలకు వెళ్లాలని చాలా కాలంగా తాడేపల్లి కోటరీలో జరుగుతోన్న చర్చ. దాని వెనుక లాజిక్ లేకపోలేదు. ఉపాథి కోసం వలస వెళ్లిన సుమారు 15 లక్షల మంది ఓటర్ల వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి పాలన మీద ఉన్నారని సర్వే సారాంశం. వాళ్లను కొంత మేరకు పరిమితం చేయాలంటే, ఏపీ, తెలంగాణ ఎన్నికలకు ఒకేసారి రావాలి. మరో వైపు కేంద్రం జమిలి ఎన్నికలు అంటూ చెబుతోంది. కేంద్రం నుంచి క్లారిటీ వచ్చిన తరవాత జగన్మోహన్ రెడ్డి ముందస్తు మీద ఒక నిర్ణయం తీసుకోనున్నారని తెలుస్తోంది.
Also Read : CM Jagan Health: సీఎం జగన్ కు అస్వస్థత , అపాయింట్మెంట్లన్నీ రద్దు
దసరాకు వైజాగ్ వెళ్లడానికి జగన్మోహన్ రెడ్డి సిద్దం అవుతున్నారు. ఆ విషయాన్ని మంత్రివర్గానికి చెప్పారని తెలుస్తోంది. ఎప్పటి నుంచో వైజాగ్ వెళ్లడానికి ఆయన ప్రిపేర్ అవుతున్నారు. సీఎం క్యాంప్ ఆఫీస్ కు సంబంధించిన భవనాల నిర్మాణం తుది దశకు చేరింది. దసరా రోజున ముహూర్తం ఉంటుందని తెలుస్తోంది. అక్కడి నుంచి ఎన్నికల శంఖారావాన్ని పూరించాలని జగన్మోహన్ రెడ్డి స్కెచ్ వేశారు. మొత్తం మీద దూకుడుగా వెళుతోన్న ఆయన విపక్షాలు తేరుకునేలోగా ఎన్నికలను ముగించాలని ప్లాన్ చేశారని వినికిడి. జైలులోనే చంద్రబాబును బంధించడం ద్వారా లబ్దిపొందడానికి అవకాశం ఉందని జగన్మోహన్ రెడ్డి భావిస్తూ ఎన్నికల దిశగా అగుడులు వేయడం గమనార్హం.