అమరావతి (Amaravati) ప్రాంత మహిళలపై చేసిన దారుణ వ్యాఖ్యలపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నేతృత్వంలోని టిడిపి-జనసేన-బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం ఈ వ్యాఖ్యలను చాలా తీవ్రంగా పరిగణలోకి తీసుకుంది. మహిళల గౌరవాన్ని కించపరిచేలా జరిగిన ఈ వ్యవహారాన్ని చంద్రబాబు మానవతా విలువలపై దాడిగా అభివర్ణించారు. “మీడియా ముసుగులో వికృత పోకడలు కలిగి ఉన్న వారి ధోరణిని ఏ విధంగానూ ఉపేక్షించబోము” అని తేల్చిచెప్పారు.
New Cabinet : మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులు..వీరి రాజకీయ ప్రస్థానం ఇదే !
చంద్రబాబు మాట్లాడుతూ.. “స్త్రీలపై గౌరవభావం మన సంస్కృతి, మన సంప్రదాయం. ఆడబిడ్డను తల్లిని ఆరాధించే మన భారతీయ జీవన విధానంలో, ఇలా తల్లులు, చెల్లెళ్లను టార్గెట్ చేసే వ్యాఖ్యలు సిగ్గుచేటు,” అని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ కక్షతో పాటు, మీడియా విశ్లేషణల పేరిట మహిళలను అవమానించే ప్రయత్నాలు క్షమించరాని నేరమని పేర్కొన్నారు. ఈ దారుణ వ్యాఖ్యల పట్ల ప్రజలు గత ఎన్నికల్లో తమ తీర్పు స్పష్టంగా వెల్లడించినా, కొందరిలో పాత విష సంస్కృతి మారలేదని విమర్శించారు.
Nara Lokesh : మాగంటి మృతి దిగ్భ్రాంతికి గురి చేసింది
తన సొంత మీడియా ఛానల్లో జరిగిన ఈ వ్యాఖ్యలను ఖండించకపోవడం, బాధ్యుడు ఇప్పటికీ స్త్రీల మన్ననలు కోరకపోవడం మరింత విచారకరమని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. రాజధాని మీద కక్షతో మహిళలపై వ్యక్తిగత దాడులకు దిగడం సర్వసాధారణ మహిళా సమాజాన్ని అవమానించడమేనని పేర్కొన్నారు. ఇకపై ఇటువంటి నీచ పోకడలపై కఠిన చర్యలు తీసుకోవడమే కాక, మహిళల ఆత్మగౌరవానికి అండగా నిలవడం తమ సంకీర్ణ కూటమి ప్రభుత్వ బాధ్యతగా పేర్కొన్నారు.