ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి విశ్వసనీయతకు అగ్నిపరీక్షగా మద్య నిషేధం మారింది. మేనిఫెస్టోలో లేదని తాజాగా మంత్రి గుడివాడ అమర్నాథ్ చెప్పడం విపక్షాల్ని, ప్రజల్ని ఆలోచింప చేస్తోంది. పైగా మద్యం లైసెన్స్ లను తాజాగా పొందిన వాళ్లు 90శాతం అధికారపక్షంకు చెందిన కాంట్రాక్టర్లు కావడం చర్చనీయాంశం అయింది. డిస్టలరీలు కూడా ఆ పార్టీకి చెందిన పారిశ్రామికవేత్తలు నిర్వహిస్తున్నారని టీడీపీ తొలి నుంచి చెబుతోంది. ఇటీవల గోదావరి జిల్లాల్లో కల్తీ మద్యం తాగి చనిపోయిన నిరుపేదల ఎపిసోడ్ ఏపీలోని మద్యం గుట్టును బయటపెట్టింది. ప్రమాదకర విష పదార్థాలు మద్యంలో ఉన్నట్టు విపక్షాలకు చెందిన కొందరు ల్యాబ్ పరీక్షల ద్వారా తేల్చారు. ఏపీలో విక్రయిస్తోన్న మద్యంపై ఇంతలా దుమారం రేగుతున్నప్పటికీ సీఎం జగన్ మాత్రం ఆదాయం కోసం నిషేధం హామీని అటకెక్కించారు.
మంత్రి గుడివాడ అమర్నాథ్ మద్య నిషేధం మేనిఫెస్టోలో లేదని వ్యాఖ్యానించిన తరువాత టీడీపీ, జనసేన సోషల్ మీడియా వేదికగా ఏకిపారేస్తున్నాయి. `మద్యం మిధ్య, నిషేధం మిధ్య, తాగొద్దు-తాగండి అని చెప్పడానికి మనమెవ్వరం` అంటూ ఒక కార్టూన్ వైరల్ అవుతోంది. దాన్ని జనసేనాని పవన్ షేర్ చేయడంతో ట్రెండింగ్ లోకి వెళ్లింది. ఏపీలోని రోడ్ల దుస్థితిపై సోషల్ మీడియా వేదికగా ఏకిపారేసిన జనసైన్యం ఇప్పుడు మద్య నిషేధం అంశాన్ని తీసుకున్నారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన హామీని గుర్తు చేస్తూ ప్రజల్లో చైతన్యం తీసుకొస్తున్నారు.
Also Read: Another Gold @CWG: కామన్ వెల్త్ గేమ్స్లో భారత్కు రెండో స్వర్ణం
మాటతప్పడం, మడమతిప్పడం వైఎస్ కుటుంబంలోనే లేదని అభిమానులు చెబుతుంటారు. మూడేళ్లు అయిన తరువాత జగన్ మోహన్ రెడ్డి మేనిఫెస్టో ఆయన ఇచ్చిన హామీల అమలును గమనిస్తే మాట మీద ఆయన నిలబడలేదని చెప్పడానికి నిదర్శనం మద్య నిషేధం. ఎన్నికల ప్రచారం సందర్భంగా మూడు దశల్లో మద్యాన్ని నిషేధిస్తామంటూ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. ఆ విషయాన్ని మేనిఫెస్టోలోనూ పెట్టారు. కానీ, ఇప్పుడు మద్యం ఆదాయాన్ని పెంచుకునేలా ప్రయత్నం చేయడం విడ్డూరం. అంతేకాదు, మద్యంపై వచ్చే ఆదాయాన్ని చూపుతూ రుణాలను తీసుకోవడం జగన్ మోహన్ రెడ్డి విశ్వసనీతను ప్రశ్నిస్తోంది.
Also Read: Minister RK Roja : చంద్రబాబుపై మంత్రి రోజా ఫైర్.. వచ్చే ఎన్నికల్లో..?
నిరుద్యోగ భృతి, ఉపాథి కల్పన, పెన్షన్ ప్రతి ఏడాది రూ. 250లు పెంపు, మద్య నిషేధం తదితరాలను జగన్ మోహన్ రెడ్డి పూర్తిగా మరిచిపోయారు. రాజధాని అమరావతి గురించి 2019 ఎన్నికల ప్రచారంలో చెప్పిన దానికి పూర్తి భిన్నంగా వ్యవహరించారు. ఎన్నికల ప్రచారానికి విరుద్ధంగా విద్యుత్, ఆర్టీసీ, పెంట్రోలు, డీజిల్ తదితర ధరలను పెంచుకుంటూ వెళుతున్నారు. సంక్షేమ పథకాలను కొంత మేరకు అమలు చేస్తోన్న ఆయన పరిపాలనను గమనిస్తే 2019 ఎన్నికల ప్రచార సభల్లో ఇచ్చిన మాటను పక్కా తప్పారని ఎవరైనా చెబుతారు. అందుకే, ఇంత కాలం పాటు విశ్వసనీయత అనే ట్యాగ్ తో రాజకీయాలను నడిపిన వైఎస్ కుటుంబానికి జగన్ మోహన్ రెడ్డి మరుపురాని మచ్చను మిగిల్చారని ఆయన అభిమానులు లోలోన మథనపడడం గమనార్హం. ఇప్పటికైనా విశ్వసనీయతకు మారుపేరుగా చెప్పుకుంటోన్న జగన్ మోహన్ రెడ్డి మద్య నిషేధం హామీపై వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. లేదంటే, విశ్వసనీయత అనే ట్యాగ్ ఎగిరిపోతుందన్న విషయాన్ని గమనించాలి.