Site icon HashtagU Telugu

Minister Lokesh: సింగపూర్‌ పర్యటన ఫలితం.. రూ.45వేల కోట్ల పెట్టుబడులు: మంత్రి నారా లోకేశ్‌

Investments of Rs. 45 thousand crores with Singapore visit: Minister Nara Lokesh

Investments of Rs. 45 thousand crores with Singapore visit: Minister Nara Lokesh

Minister Lokesh: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సింగపూర్‌లో చేసిన పర్యటన విజయవంతమైందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి నారా లోకేశ్‌ తెలిపారు. గురువారం ఆయన సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ..ఈ పర్యటన ఫలితంగా ఐదేళ్లలో రూ.45 వేల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు కుదిరాయని వెల్లడించారు. ఈసారి ఎంవోయూలు కుదుర్చుకునే పని కాకుండా, నేరుగా కార్యాచరణకు దారితీసే విధంగా ఒప్పందాలను చేసుకున్నట్టు మంత్రి చెప్పారు. స్టీల్, డేటా సెంటర్‌, ఐటీ రంగాల్లో భారీ పెట్టుబడుల కోసం ప్రముఖ సంస్థలతో ప్రత్యక్షంగా చర్చలు జరిగాయని వెల్లడించారు. ముఖ్యంగా ఆర్సెలర్ మిత్తల్ సంస్థను Zoom కాల్‌ ద్వారా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించామని, దేశంలోనే అతిపెద్ద స్టీల్ ప్లాంట్‌ను ఏపీలో ఏర్పాటు చేయాలని ప్రణాళిక సిద్ధమైందని చెప్పారు.

జగన్ పాలనలో ఏపీ బ్రాండ్‌కు నష్టం

2019 నుంచి 2024 మధ్య కాలంలో అప్పటి ప్రభుత్వం ఏపీ బ్రాండ్‌ను నాశనం చేసిందని విమర్శించారు. అమరావతిని సంయుక్తంగా అభివృద్ధి చేద్దామని సింగపూర్‌ ప్రభుత్వం ప్రతిపాదించిందని, కానీ జగన్‌ నేతృత్వంలోని ప్రభుత్వమే ఆ దేశంతో ఉన్న ఒప్పందాలను రద్దు చేసిందని లోకేశ్‌ ఆరోపించారు. ప్రపంచంలో పారదర్శక పాలనలో ముందుండే సింగపూర్‌పై అవినీతి ఆరోపణలు చేయడం రాష్ట్ర ఖ్యాతిని దెబ్బతీసే పని అని అన్నారు.

పరిశ్రమల తరిమివేత.. ఐటీ అభివృద్ధికి కొత్త దిశ

అమర్‌రాజా, లులు గ్రూప్‌ వంటి ప్రముఖ సంస్థలను రాష్ట్రం నుంచి తరిమేసిన ప్రభుత్వమే, పెట్టుబడుల రాకకు కారణమని లోకేశ్‌ స్పష్టం చేశారు. అయితే ఇప్పుడు ఐటీ అభివృద్ధికి విశాఖపట్నంను కేంద్రంగా చేసుకొని ప్రత్యేక ప్రణాళికను రూపొందించినట్లు తెలిపారు. బెంగళూరుకు కర్ణాటక, చెన్నైకు తమిళనాడు లాగానే, విశాఖపట్నం AP ఐటీ కేంద్రంగా ఎదగాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వెల్లడించారు.

భూముల కేటాయింపుపై స్పష్టత

టీసీఎస్ సంస్థకు భూమి కేటాయింపుపై కూడా మంత్రి స్పందించారు. ఏ రాష్ట్రం చేయని విధంగా టీసీఎస్‌కు ఎకరా రూ.99పైసలకే భూమిని కేటాయించామని, దీనిపై వైసీపీ కోర్టుకు వెళ్లిందని చెప్పారు. అయితే హెరిటేజ్‌ సంస్థకే తక్కువ ధరకు భూములు ఇవ్వని తమ ప్రభుత్వం, టీసీఎస్‌కు మాత్రం భవిష్యత్తులో ఉద్యోగ అవకాశాల దృష్ట్యా ఇచ్చిందని అన్నారు. జీతాలు, ఉపాధి వస్తే అలాంటి కంపెనీలకు తక్కువ ధరకు భూములు ఇవ్వడంలో తప్పేం లేదు? అని ఆయన ప్రశ్నించారు.

వైసీపీ కుట్రలు.. పెట్టుబడులకు అడ్డుపడే చర్యలు

పెట్టుబడులు రాకుండా వైకాపా మద్దతుదారులు విదేశాల్లోనూ కుట్రలు చేస్తున్నారని లోకేశ్‌ ఆరోపించారు. సింగపూర్‌ ప్రభుత్వ అధికారులకు మురళీ కృష్ణ అనే వ్యక్తి ఈ-మెయిల్‌ ద్వారా ఏపీలో ప్రభుత్వం మారనుందన్న సందేశం పంపారని చెప్పారు. అతడికి వైసీపీ నేతలతో సంబంధాలున్నాయని ఆరోపించారు. పెట్టుబడుల కోసం తమిళనాడులో రాజకీయ పార్టీలు కలిసి పని చేస్తే, ఏపీలో మాత్రం పెట్టుబడులను అడ్డుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శించారు. ఇలాంటి చలనలు చేస్తే నష్టపోయేది తెలుగువారే అని నారా లోకేశ్‌ అన్నారు.

Read Also: Jagan : జగన్ పర్యటనలో తొక్కిసలాట.. కానిస్టేబుల్‌కు గాయాలు