Dr Apj Abdul Kalam International School Nellore నెల్లూరులో డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం అంతర్జాతీయ పాఠశాల ఏర్పాటుకు మంత్రి నారాయణ శంకుస్థాపన చేశారు. పేదలకు నాణ్యమైన విద్య అందించాలనే లక్ష్యంతో రూ.20 కోట్లతో ఈ స్కూల్ నిర్మిస్తున్నారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నిధులతో నిర్మాణం జరుగుతుంది. జూన్ 12 నాటికి అడ్మిషన్లు ప్రారంభమవుతాయి. మైనార్టీల పట్ల సీఎం చంద్రబాబుకు అభిమానం ఉందని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి తెలిపారు.
- నెల్లూరులో ఇంటర్నేషనల్ స్కూల్కు శంకుస్థాపన
- డాక్టర్ ఏపీజే అబ్దుల్కలాం ఇంటర్నేషనల్ స్కూల్
- వక్ఫ్ బోర్డు ఆధ్వర్యంలో స్కూల్ ఏర్పాటు చేస్తున్నారు
ఈ సమాజంలో చదువుతోనే గౌరవం వస్తుందన్నారు మంత్రి నారాయణ. నెల్లూరు నగరంలో వక్ఫ్ బోర్డుకు చెందిన ఐదెకరాల స్థలంలో డాక్టర్ ఏపీజే అబ్దుల్కలాం అంతర్జాతీయ పాఠశాల ఏర్పాటుకు శంకుస్థాపన కార్యక్రమానికి హాజరయ్యారు. నెల్లూరు పరమేశ్వరినగర్లో వక్ఫ్ బోర్డుకు చెందిన ఐదెకరాల స్థలంలో డాక్టర్ ఏపీజే అబ్దుల్కలాం ఇంటర్నేషనల్ స్కూల్ నిర్మిస్తున్నారు. ఈ స్కూల్ నిర్మాణానికి సుమారు రూ.20 కోట్ల వరకు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. ఎన్సీసీ గ్రూపు ఈ పాఠశాల డిజైన్ను రూపొందించింది. ఈ ప్రాజెక్టుకు అవసరమైన నిధులను కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్సార్) ద్వారా సేకరిస్తామని మంత్రి తెలిపారు. ఈ శంకుస్థాపన కార్యక్రమంలో వక్ఫ్ బోర్డు రాష్ట్ర ఛైర్మన్ అబ్దుల్ అజీజ్, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి, నగర ఇంఛార్జ్ మేయర్ రూప్కుమార్ యాదవ్, నుడా ఛైర్మన్ శ్రీనివాసులురెడ్డి, శాసనమండలి మాజీ ఛైర్మన్ షరీఫ్, మంత్రి నారాయణ కుమార్తె శరణి పాల్గొన్నారు.
ఈ స్కూల్ ఏర్పాటుకు సుమారు రూ.20 కోట్లు ఖర్చవుతుందని.. దీనికి ఎన్సీసీ గ్రూపు డిజైన్ చేసింది. ఈ స్కూల్కు అవసరమైన నిధులను సీఎస్సార్ ద్వారా సమకూరుస్తామని మంత్రి నారాయణ తెలిపారు. నెల్లూరు నగరంలో తాను 84 వేల ఇళ్లను సందర్శించినట్లు మంత్రి నారాయణ తెలిపారు. ఆ సమయంలో పేదలకు నాణ్యమైన విద్యను అందించాల్సిన అవసరాన్ని గుర్తించానని, అందుకే ఈ అంతర్జాతీయ పాఠశాల ఏర్పాటుకు నిర్ణయించుకున్నానని ఆయన వెల్లడించారు. ఈ స్కూల్లో ఉచితంగానే విద్యను అందించనున్నారు.
ఎన్నికల ప్రచారంలో పేదవారి కష్టాలు స్వయంగా చూశానని.. అందుకే పేద పిల్లల కోసం స్కూల్స్ అభివృద్ధి చేస్తున్నామని.. జూన్ 12 నాటికల్లా ఈ స్కూల్ లో అడ్మిషన్లు ప్రారంభిస్తామన్నారు మంత్రి నారాయణ. నగరంలోని 15 పాఠశాలల అభివృద్ధికి పలువురి సహకారం తీసుకున్నట్లు ఆయన వివరించారు. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి, బీద మస్తాన్రావు, డీఎస్సార్ కన్స్ట్రక్షన్స్ ప్రతినిధి సుధాకర్రెడ్డి, డాక్టర్ భాస్కర్, సీఎం రమేశ్, రెడ్డి ల్యాబ్స్, టీవీఎస్ కంపెనీల నుంచి సహాయం అందిందని తెలిపారు. మైనార్టీల పట్ల సీఎం చంద్రబాబుకు ఎంతో అభిమానం ఉందని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి అన్నారు.
