Viveka Murder Case : వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అప్రూవర్ గా మారిన దస్తగిరిపై.. ఇటీవల ఓ ప్రేమజంట వ్యవహారంలో అట్రాసిటీ, దాడి కేసులు నమోదయ్యాయి. గత 4 నెలలుగా కడప జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న దస్తగిరికి ఇటీవల బెయిల్ లభించింది. ఈ నేపథ్యంలో ఆయన శుక్రవారం రోజు కడప జైలు నుంచి రిలీజయ్యారు. అంతకుముందు తన విడుదలపై జైలు గెస్ట్ హౌస్లో ఉన్న సీబీఐ అధికారులకు సమాచారాన్ని అందించారు. జైలు నుంచి విడుదలైన తర్వాత దస్తగిరి పోలీసు బందోబస్తు నడుమ పులివెందుల వెళ్లారు. ఈసందర్భంగా దస్తగిరి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
We’re now on WhatsApp. Click to Join
‘‘చావడానికైనా నేను సిద్ధమే.. కానీ సీఎం జగన్, ఎంపీ అవినాష్రెడ్డిల బెదిరింపులకు తలొగ్గేది లేదు. పులివెందులలో ఎంపీ అవినాష్రెడ్డి ఇంటి పక్కనే నేను నివాసం ఉంటాను. ఎవరికీ భయపడే ప్రసక్తే లేదు. వివేకా హత్యకు సంబంధించి తప్పుచేసి ప్రాయశ్చిత్తంతో అప్రూవర్గా మారాను. ఇప్పుడు సీఎం, ఎంపీల మాటలు విని మళ్లీ తప్పు చేసి పాపం మూటకట్టుకో దలచుకోలేదు’’ అని దస్తగిరి (Viveka Murder Case) స్పష్టం చేశారు.
‘‘గత ఎన్నికల్లో వివేకా హత్యను అడ్డం పెట్టుకుని సానుభూతితో జగన్ గెలుపొందారు. ఇప్పుడు మళ్లీ అదే కుట్రతో గెలవాలని ప్రయత్నిస్తున్నారు. ఈసారి వివేకాను ఎవరు హత్య చేశారో చెప్పి ఓట్లు అడగాలి. వారిద్దరూ పులివెందులలో ఓట్లు అడిగే పక్షంలో ప్రజలు రాళ్లు వేస్తారు. సిద్ధం సభల్లో వివేకాను హత్య చేసిందెవరో జగన్ చెబితే బాగుంటుంది’’ అని దస్తగిరి పేర్కొన్నారు.
‘‘వివేకా కేసులో అప్రూవర్గా ఉన్నాననే ఉద్దేశంతోనే కుట్ర పన్ని.. తప్పుడు కేసుల్లో ఇరికించి కొందరు పెద్దలు నన్ను జైలుకు పంపారు. కడప జైల్లో ఉన్న సమయంలో వివేకా కేసు నిందితుడు దేవిరెడ్డి శివశంకర్రెడ్డి కుమారుడు చైతన్యరెడ్డి నన్ను కలిశారు. డబ్బు ఆశ చూపించి రాజీకి రావాలని అభ్యర్థించారు. సీబీఐ ఎస్పీ రాంసింగ్కు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పాలని ప్రలోభ పెట్టారు. వెనక్కితగ్గే ప్రసక్తే లేదని నేను తేల్చి చెప్పాను’’ అని దస్తగిరి వివరించారు.