AP Elections – Hyderabad : ఏపీ ఎన్నికల ఎఫెక్టు హైదరాబాద్పై స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికే చాలామంది ఓటు వేసేందుకు సిటీ నుంచి ఏపీకి వెళ్లిపోయారు. మే 13న (సోమవారం) అసెంబ్లీ ఎన్నికలు ఉండగా.. అంతకుముందు రెండు రోజులు వీకెండ్ సెలవులు ఉండటంతో ఏపీ ప్రజలు హైదరాబాద్ నుంచి సొంతూరి బాట పడుతున్నారు. దీంతో భాగ్యనగరం బోసిపోయి కనిపిస్తోంది. ఏపీవాసులు ఎక్కువగా నివసించే ఏరియాల్లో ట్రాఫిక్ రద్దీ కూడా చాలావరకు తగ్గింది. రెగ్యులర్గానైతే హైదరాబాద్ నుంచి ఏపీలోని ప్రాంతాలకు నడిచే ప్రైవేటు, ఆర్టీసీ బస్సులు శుక్ర, శని, ఆదివారాల్లో మాత్రమే నిండుగా ఉంటాయి. కానీ గత వారం రోజులుగా ప్రతిరోజూ 100 శాతం ఆక్యుపెన్సీతో బస్సులు నడుస్తున్నాయి. దీనికి కారణం కచ్చితంగా ఎన్నికలే. వచ్చే వారం రోజుల కోసం బస్సుల రిజర్వేషన్లకు కూడా భారీ డిమాండ్ ఏర్పడింది.
We’re now on WhatsApp. Click to Join
ట్రైన్ల సంగతి కూడా ఇలాగే ఉంది. ఏపీ వైపు వెళ్లే ట్రైన్ల టికెట్లన్నీ బుక్ అయి భారీగా వెయిటింగ్ లిస్ట్ లు ఉన్నాయి. అందుకే ఇటువైపు నుంచి తెలంగాణ ఆర్టీసీ, అటు వైపు నుంచి ఏపీ ఆర్టీసీ పెద్దసంఖ్యలో బస్సులు నడుపుతున్నాయి. ఓటర్లు ఏపీ నుంచి హైదరాబాద్కు తిరిగొచ్చేందుకు వీలుగా పోలింగ్ రోజున (మే 13న) తెల్లవారుజాము నుంచి అర్ధరాత్రి వరకు పెద్దసంఖ్యలో బస్సులు నడపనున్నారు. టీఎస్ఆర్టీసీ రోజూ నడిచే 3,450 బస్సులే కాక, మరో వెయ్యికి పైగా బస్సులను నడపబోతోంది. వీటిలో దాదాపు 200 బస్సుల్లో రిజర్వేషన్ సౌకర్యాన్ని కల్పిస్తున్నారు. ఏపీలో ఈనెల 9 నుంచి 12 వరకు రోజూ నడిచే 352 బస్సులకు అదనంగా 500 బస్సులను నడుపనున్నారు. అదనంగా నడుపుతున్న పలు బస్సుల్లో రిజర్వేషన్ సౌకర్యం ఉంటుంది.
ఎన్నికల వేళ ప్రజల రాకపోకలు పెరగడాన్ని సొమ్ము చేసుకునేందుకు ప్రైవేటు ట్రావెల్స్ రెడీ అయ్యాయి. బస్సు టికెట్లను రిజర్వేషన్ చేసుకునే వారికి ప్రైవేటు ట్రావెల్స్ చుక్కలు చూపిస్తున్నాయి. మచ్చుకు పరిశీలిస్తే.. గతంలో రూ.500 ఉన్న రిజర్వేషన్ టికెట్ రేటు.. ఇప్పుడు రూ.1000 దాటేయడం గమనార్హం.
ఏపీకి చెందిన కొన్ని రాజకీయ పార్టీలు తమకు ఓటు వేసే వారిని హైదరాబాద్ నుంచి తరలించేందుకు ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకోసం హెల్ప్లైన్ నెంబర్లను కూడా నడుపుతున్నట్లు సమాచారం. దీంతో పలువురు ఆయా పార్టీల తరఫున ఫ్రీగా సొంతూళ్లకు వెళ్లేందుకు రెడీ అవుతున్నారు. ఆయా రాజకీయ పార్టీలు తమకు ఓటు వేసే వారిని సిటీ నుంచి తరలించేందుకు పలు ట్రావెల్స్ సంస్థలతో జట్టుకట్టి ముందుకు సాగుతున్నట్లు చెబుతున్నారు. సిటీ నుంచి ఏపీలోని వివిధ ప్రాంతాలకు వెళ్లేవారు ఎవరెవరిని సంప్రదించాలి ? ఎలా సంప్రదించాలి ? అనే సమాచాారాన్ని సదరు రాజకీయ పార్టీలు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నట్లు చెబుతున్నారు.