మదనపల్లె: అన్నమయ్య జిల్లాలోని మదనపల్లె వ్యవసాయ మార్కెట్యార్డులో టమాటా ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. బుధవారం వరకు అత్యధికంగా కిలో టమాటా రూ.100 వరకు ఉంది. గురువారం ఈ ధరలు ఒక్కసారిగా తగ్గాయి. ఇవాళ ఏ గ్రేడ్ కిలో టమాటా రూ.50 నుంచి రూ.64 వరకు, బీ గ్రేడ్ రూ.36 నుంచి రూ.48 వరకు ఉంది. సగటున కిలో టమాటా రూ.44 నుంచి రూ.60తో వ్యాపారులు రైతుల వద్ద కొనుగోలు చేసినట్లు మార్కెట్ యార్డ్ కార్యదర్శి అభిలాష్ తెలిపారు.
ఇక తెలంగాణలో రైతు బజార్లలో కిలో టమాటా రూ. 65-100 మధ్య పలుకుతోంది. బయట మార్కెట్లో మాత్రం రూ. 120-140 మధ్య ఉంది. పది రోజుల క్రితం హైదరాబాద్ కు హోల్సేల్ మార్కెట్కు 850 క్వింటాళ్ల టమాటా రాగా ఇటీవల ఏకంగా 2,450 క్వింటాళ్ల టమాటా వచ్చింది. దీనికితోడు రంగారెడ్డి, చేవెళ్ల, నవాబ్పేట, మెదక్, వికారాబాద్ జిల్లాల నుంచి కూడా మార్కెట్కు టమాటాలు పోతెత్తడంతో ధర తగ్గుముఖం పట్టింది. ఈ నెలాఖరుకు కిలో టమాటా రూ. 50కి తగ్గే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు.
ఇటీవలి కాలంలో వరుసగా టమాటాల చోరీ ఘటనలు చోటుచేసుకొంటున్నాయి. ఇప్పటికే సిద్దిపేట జిల్లాలో వరుస ఘటనలు చోటుచేసుకోవడంతో రైతులు లబోదిబోమంటున్నారు. తమ కుటుంబ సభ్యులతో కలిసి పంటకు రక్షణగా నిలుస్తున్నారు. రైతులు చాలామంది తన టమాటా పొలం వద్ద సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటుండటం గమనార్హం.
Also Read: Telangana Boxer: మాట నిలబెట్టుకున్న ఆనంద్ మహీంద్రా, నిఖత్ జరీన్ కు థార్ కారు గిఫ్ట్