ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకునేందుకు శుక్రవారం భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. వేసవి సెలవుల నేపథ్యంలో తెల్లవారుజామున 5 గంటల నుంచే ఆలయానికి భక్తుల రాక పెరిగి, క్యూ లైన్లు కిక్కిరిసిపోయాయి. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సాధారణ భక్తులకు త్వరితగతిన దర్శనం కల్పించేందుకు ఉదయం 10.30 గంటల నుంచి అంతరాలయ దర్శనాలను తాత్కాలికంగా నిలిపివేశారు. అలాగే మధ్యాహ్నం 2 గంటల వరకు అన్ని రకాల వీఐపీ దర్శనాలను రద్దు చేశారు. దీంతో సామాన్య భక్తులకు వేగంగా అమ్మవారి దర్శనం లభించింది.
వేసవి ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ఆలయ ఈఓ శీనా నాయక్ ఆధ్వర్యంలో క్యూ లైన్లలో వేచి ఉన్న భక్తులకు మొబైల్ వాటర్ క్యాన్ల ద్వారా చల్లని తాగునీటిని అందించారు. భక్తుల వద్దకే నేరుగా తాగునీరు చేరవేయడం పట్ల భక్తులు హర్షం వ్యక్తం చేశారు. అలాగే ఆలయ ప్రాంగణంలో ఉచిత ప్రసాదం, అన్నదాన కార్యక్రమాలు నిరంతరాయంగా నిర్వహించారు. ఎండ వేడిమిలో దర్శనానికి వచ్చిన భక్తులకు ఈ ఏర్పాట్లు ఎంతో ఉపశమనం కలిగించాయి. భక్తుల రద్దీ అత్యధికంగా ఉన్న సమయంలో ఆలయ చైర్మన్ బొర్రా రాధాకృష్ణ (గాంధీ), ధర్మకర్తల మండలి సభ్యులు స్వయంగా క్యూ లైన్లలో పర్యటించి ఏర్పాట్లను పర్యవేక్షించారు. భక్తులతో మాట్లాడి వారి అవసరాలను తెలుసుకున్నారు. ఆలయ అధికారులు చేపట్టిన ఏర్పాట్లు, ప్రత్యేకంగా తాగునీటి సరఫరా, అన్నదాన సేవలపై భక్తులు సంతృప్తి వ్యక్తం చేస్తూ ప్రశంసలు కురిపించారు.
