మాజీ మంత్రి కొడాలి నాని అలియాస్ కొడాలి వెంకటేశ్వరరావు ఏపీ న్యూస్ మేకర్. ఆయన మీడియా ముందుకొస్తే ప్రకంపనలు సృష్టిస్తారని వైసీపీ నమ్ముతోంది. కిడ్నా సంబంధ వ్యాధితో హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో ఆయన చేరడం కూడా ఇప్పుడు హాట్ న్యూస్ గా మారింది. దానికి కారణం లేకపోలేదు. ఎవరైనా ఆరోగ్యం బాగాలేక హైదరాబాద్ ఆస్పత్రులకు వస్తే ఆయన విమర్శించే వాళ్లు. ప్రత్యేకించి చంద్రబాబు, లోకేష్ హైదరాబాద్ లో ఉండడాన్ని కూడా పలుమార్లు ఆయన ప్రస్తావించారు. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు విదేశాల్లో నోటి పళ్ల సెట్ కట్టించుకోవడాన్ని అసెంబ్లీ వేదికగా ప్రశ్నించారు.
ఏపీలోని ఆస్పత్రుల్లో మెరుగైన చికిత్స అందుతుందని పలుమార్లు మాజీ మంత్రి కొడాలి, ప్రస్తుత మంత్రి రోజా మీడియా ముందు చెప్పారు. కరోనా సందర్భంగా అద్భుతంగా ఏపీలోని ఆస్పత్రులు పనిచేశాయని కొనియాడారు. ఇతర రాష్ట్రాలకు వెళ్లి చికిత్స చేయించుకోవాల్సిన అవసరం ఏముందుని పలు సందర్భాల్లో వాళ్లు ప్రశ్నించారు. ఆ మధ్య మంత్రి రోజాకు బాగాలేకపోతే చెన్నై ఆస్పత్రిలో చికిత్స చేయించుకున్నారు. స్వల్ప ఆపరేషన్ కు కూడా ఆమె చెన్నై ఆస్పత్రికి వెళ్లారు. ఇప్పుడు కిడ్నీలో రాళ్ల చికిత్స కోసం కొడాలి హైదరాబాద్లోని ఆస్పత్రిలో చేరారు.
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి లండన్ తరహా వైద్యం అందిస్తామని హామీ ఇచ్చారు. ఆ మేరకు మౌలిక సదుపాయాలు కల్పించామని ప్రకటించారు. ప్రతి ఒక్కరి ఆరోగ్యాన్ని రికార్డ్ చేయడం ద్వారా ఫ్యామిలీ డాక్టర్ వైద్యాన్ని తీసుకొస్తున్నామని వెల్లడించారు. సీన్ కట్ చేస్తే, ఎవరికి అనారోగ్యంగా ఉన్న అటు తమిళనాడు ఇటు తెలంగాణకు ప్రభుత్వంలోని ఉన్నతాధికారులు, మంత్రులు పరుగెత్తడం చూస్తున్నారు. ఇటీవల ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కూడా హైదరాబాద్ లోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స చేయించుకున్నారు.
ప్రస్తుతం మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో చేరారు. కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతూ ఆస్పత్రిలో అడ్మిట్ చేరారు. కిడ్నీలో రాళ్లను తొలగిస్తూ వైద్యులు సర్జరీ చేశారు. ఆయన నాని కోలుకున్నారని, రెండు, మూడు రోజుల్లో డిశ్చార్జ్ అవుతారని తెలుస్తోంది. రెండు వారాల పాటూ విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సూచించినట్లు సమాచారం. త్వరగా ఆయన కోలుకోవాలని వైఎస్సార్సీపీ కార్యకర్తలు ట్వీట్లు చేస్తున్నారు. కొడాలి నాని మూడు రోజుల క్రితం ఆస్పత్రిలో చేరినట్లు తెలుస్తోంది.