Site icon HashtagU Telugu

Srisailam Dam : శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు..మూడు గేట్ల ద్వారా నీటి విడుదల

Srisailam Dam 3 Gates Open

Srisailam Dam 3 Gates Open

కృష్ణానదికి ఉపరితల ప్రాంతాల్లోని కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో నదిలో వరద ప్రవాహం కొనసాగుతోంది. ఈ కారణంగా సుంకేశుల, జూరాల ప్రాజెక్టుల నుంచి శ్రీశైలం జలాశయానికి భారీగా వరదనీరు చేరుతోంది. ప్రస్తుతం శ్రీశైలం జలాశయానికి 1,27,392 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదు కాగా, ఔట్‌ఫ్లో 1,40,009 క్యూసెక్కులుగా ఉంది. ఇక వరద ప్రభావంతో శ్రీశైలం ప్రాజెక్టు మూడు గేట్లను అధికారులు ఎత్తారు.

ప్రస్తుతం రెండు స్పిల్‌వే గేట్ల ద్వారా 53,764 క్యూసెక్కుల నీటిని నాగార్జున సాగర్ జలాశయానికి విడుదల చేస్తున్నారు. అంతేకాకుండా, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ నుంచి 20 వేల క్యూసెక్కులు, ఎడమ గట్టు విద్యుత్ కేంద్రం నుంచి 35,315 క్యూసెక్కులు, కుడి గట్టు విద్యుత్ కేంద్రం నుంచి 30,930 క్యూసెక్కుల వరద నీటిని విడుదల చేస్తున్నారు. ఇది కిందటి ప్రాజెక్టులకు వరద పోటును సమర్థవంతంగా కంట్రోల్ చేయడంలో భాగంగా చేపడుతున్నారు.

Ilayaraja : సుప్రీంకోర్టులో సంగీత దిగ్గజం ఇళయరాజాకు ఎదురుదెబ్బ !

శ్రీశైలం జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 882.40 అడుగుల వద్ద నీటి మట్టం నమోదైంది. పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా, ప్రస్తుతం అందుబాటులో ఉన్న నీటి నిల్వ 201.12 టీఎంసీలుగా ఉంది. ఈ నేపథ్యంలో జలాశయ నీటి నిల్వ త్వరగా పూర్తి స్థాయికి చేరే అవకాశముంది.

ప్రస్తుతం వరద పరిస్థితుల్లో అధికారులు పర్యవేక్షణను కఠినంగా చేపట్టారు. డ్యామ్ వద్ద భద్రతా చర్యలు తీసుకుంటున్నారు. కృష్ణా డెల్టాకు అవసరమైన నీటిని విడుదల చేసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఒకవేళ వర్షాలు ఇంకా కొనసాగితే, మరిన్ని గేట్లు ఎత్తే అవకాశముందని జలవనరుల శాఖ అంచనా వేస్తోంది. దీంతో కృష్ణానది తీర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.