Hamoon – Rains Today : 2018 సంవత్సరం తర్వాత తొలిసారిగా రెండు తుఫానులు ఒకే టైంలో మన దేశ సముద్రతీరంలో సంభవించాయి. బంగాళాఖాతంలో హమూన్ తుఫాను ఏర్పడగా.. అరేబియా సముద్రంలో తేజ్ తుఫాను ఏర్పడింది. ఈశాన్య రుతుపవనాల సీజన్లో అరుదుగా ఈవిధంగా జంట తుఫానులు వస్తుంటాయని వాతావరణ నిపుణులు అంటున్నారు. మన తెలుగు రాష్ట్రాలకు సమీపంలోని బంగాళాఖాతంలో ఏర్పడిన హమూన్ తుఫాను విషయానికి వస్తే.. ప్రస్తుతం అది ఒడిశాలోని పారాదీప్కు 520 కిలోమీటర్ల దక్షిణ ఆగ్నేయంగా కేంద్రీకృతమై ఉంది. ఇంకొన్ని గంటల్లో అది ఉత్తర ఈశాన్యంగా దిశ మార్చుకొని బంగ్లాదేశ్ వైపు వెళ్లిపోతుందని అంచనా వేస్తున్నారు. హమూన్ ప్రభావంతో సోమవారం మధ్యాహ్నం నుంచి ఆంధ్రప్రదేశ్లోని ఉత్తర కోస్తా తీర ప్రాంతాల వెంబడి గాలులు వీస్తాయని.. శ్రీకాకుళం జిల్లాలో అక్కడక్కడ మోస్తరుగా వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇవాళ శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో కూడా తేలికపాటి వానలు పడొచ్చని పేర్కొన్నారు. మిగతా కోస్తా ప్రాంతంలో మరో వారం వరకు వర్షాలు పడే అవకాశం లేదని తెలిపారు. ఆగస్టు నుంచి ఏపీలో వర్షాలు పెద్దగా పడలేదు.. దీంతో తుఫాన్ ఏర్పడుతుందనే అంచనాలతో అందరూ వానలు పడతాయని అనుకున్నారు. అయితే పరిస్థితి మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా ఉంది.. ఎండలు, ఉక్కపోత ప్రభావం కొనసాగుతోంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా జనాలు ఉక్కిరి బిక్కిరి(Hamoon – Rains Today) అవుతున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
ఇక అరేబియా మహాసముద్రంలో ఏర్పడిన తేజ్ తుఫాన్ తీవ్ర తుఫానుగా మారి యెమన్, ఒమన్ దేశాల సముద్ర తీరాల వైపు కదులుతోందని భారత వాతావరణ విభాగం తెలిపింది. ఈ తుఫాను వాయవ్య దిశగా కదిలి యెమన్ లోని ఆల్గైదా, ఒమన్ లోని సలాలా నగరాల మధ్య తీరం దాటుతుందని పేర్కొంది. ఈ తుఫాన్ తీరం దాటే సమయంలో గంటకు 140 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వెల్లడించింది. ఈ తుఫాను తీరం దాటే టైంలో గుజరాత్ లోని పలు తీర ప్రాంతాల్లో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది.