ఆంధ్రప్రదేశ్ మూడు రాజధానుల నిర్మాణం ప్రాజెక్టును గుజరాత్ ఆర్కిటెక్ట్ భీమాల్ పటేల్ కు అప్పగించేందుకు రంగం సిద్ధం అయింది. ఇప్పటికే సెంట్రల్ విస్టా ప్రాజెక్టు పటేల్ డిజైన్ మేరకు నిర్మితం అవుతోంది. ఆయన కంపెనీ పార్లమెంట్ తో పాటు కేంద్ర మంత్రులకు అవసరమైన ఆఫీసులను నిర్మిస్తోంది. అంతేకాదు, అహ్మదాబాద్ లో రివర్ పోర్ట్ ప్రాజెక్టు, సబర్మతి పునరాభివృద్ధి ప్రాజెక్టు ను చేపట్టారు. పబ్లిక్ కార్యాలయాలు, ఎగ్జిక్యూటివ్ భవనాల నిర్మాణంపై అపార అనుభవం భీమాల్ పటేల్ కంపెనీకి ఉంది. ఆ దృష్ట్యా ఏపీలోని మూడు రాజధానుల భవనాల నిర్మాణ బాధ్యతలను పటేల్ అప్పగించినట్టు విశ్వసనీయంగా తెలుస్తోంది. ఆ మేరకు ఏపీ ప్రభుత్వానికి, పటేల కంపెనీకి మధ్య ప్రాథమిక ఒప్పందాలు జరిగింది. ప్రస్తుతం విశాఖపట్నంలో ప్రభుత్వానికి అవసరమైన విశ్రాంతి భవన నిర్మాణం చేపడుతున్నట్టు మీడియాకు పటేల్ వివరించాడు. న్యాయపరమైన చిక్కులు ఉన్న విషయాన్ని గుర్తు చేస్తూ..అంతుకు మించిన సమాచారాన్ని ఇవ్వలేనని చెప్పడం గమనార్హం. ఏపీలోని ప్రభుత్వ ఉన్నతాధికారులు ఇప్పటికే న్యాయపరమైన చిక్కుల విషయాన్ని పటేల్ కు తెలియచేశారు. వాటిని పరిష్కరించుకుంటూ ప్రాజెక్టును నిర్మించుకోవడానికి ప్రభుత్వ, పటేల్ కంపెనీ మధ్య అవగాహన కుదిరింది.
అమరావతి ప్రాంతంలో శాసన సభ, ఇతర భవనాల నిర్మాణం చేపడతారు. వైజాగ్ లో సచివాలయం, ఉద్యోగులకు అవసరమైన ఆఫీసులు, కార్యాలయం భవనాలు, గెస్ట్ హౌస్ లు, సమావేశ మందిరాలను నిర్మించడానికి డిజైన్ ఇప్పటికే ఓకే అయింది. అందులో భాగంగా భవనాలు కొన్నింటిని పటేల్ కంపెనీ సిద్ధం చేసింది. రాష్ట్రం విడిపోయిన తరువాత రాజధాని ప్రాంతంగా విజయవాడ, గుంటూరు మధ్యన ఆనాడు ఉన్న చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించింది. భూ సమీకరణ ద్వారా ప్రపంచ గుర్తింపు ఉండేలా రాజధాని నిర్మాణం చేయాలని అప్పట్లో సింగపూర్ కంపెనీలతో డిజైన్ వేయించారు. సీఆర్ డీఏను ప్రభుత్వం తరపు ఏర్పాటు చేసి, దాన్ని సింగపూర్ కన్సార్టియంతో అనుసంధానం చేశారు. అమరావతి రాజధాని డిజైన్లను ఫైనల్ చేసి, నిర్మాణ పునాదులువేశారు.
చంద్రబాబు నాయుడు 2019లో అధికారం కోల్పోయిన తరువాత అమరావతి ప్రాజెక్టు మూలన పడింది. మూడు రాజధానుల అంశం తెరపైకి వచ్చింది. ఫలితంగా భూములు ఇచ్చిన రైతులు రోడ్డు పడ్డారు. న్యాయం చేయాలని హైకోర్టు, సుప్రీం కోర్టు వరకు వెళ్లారు. ఈ క్రమంలో ప్రస్తుతానికి సైలెంట్ గా ఉన్న జగన్ ప్రభుత్వం చాపకింద నీరులా మూడు రాజధానులు నిర్మాణం చేయడానికి పటేల్ కంపెనీతో ఒప్పందం చేసుకుంది. మూడు రాజధానులకు సంబంధించిన భవనాలను నిర్మించడానికి గుజరాత్ కు చెందిన బీమాల్ పటేల్ రంగంలోకి దిగాడు. సెంట్రల్ విస్టాతో పాటు ఏపీలోని మూడు నగరాలను రాజధానులుగా మలచడానికి డిజైన్ ఫైనల్ అయింది. విశాఖలో ప్రాథమికంగా అవసరమైన భవనాలను సిద్ధం అయ్యాయి. సో..ఇక జగన్ పాలన విశాఖ నుంచి లాంఛనంగా ప్రారంభ కావడమే మిగిలిందన్నమాట.