ఏపీలో ప్రభుత్వ ఉపాధ్యాయుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. సకాలంలో జీతాలు రాకపోవడంతో ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. ఉరవకొండ మండలం చిన్న ముష్టూరు ఎంపీయూపీ స్కూల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు వేతనాలు ఆలస్యం కావడంతో మనస్తాపం చెంది నిద్రమాత్రలు వేసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. పెన్నా అహోబిలం నరసింహ స్వామి దేవాలయం సమీపంలోని నిర్జన ప్రదేశంలో బి మల్లేష్ అనే ఉపాధ్యాయుడు నిద్రమాత్రలు సేవించాడు. సీపీఎస్ సమస్యపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతూ ఐదు పేజీల లేఖను ఉపాధ్యాయుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ లేఖ ఆదివారం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. తాను వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి వీరాభిమానినని, 2019 ఎన్నికల్లో ఆయనకు మద్దతిచ్చానని ఉపాధ్యాయుడు మల్లేష్ పేర్కొన్నాడు. సీపీఎస్ రద్దు చేస్తామని జగన్రెడ్డి హామీ ఇచ్చారని కానీ ఇప్పటి వరకు అమలు చేయలేదన్నారు. అంతే కాకుండా ప్రతినెలా జీతాలు కూడా సక్రమంగా ఇవ్వడం లేదని లేఖలో పేర్కొన్నారు. కనీసం ప్రతినెలా 5వ తేదీలోగా ఉపాధ్యాయులకు జీతాలు జమ చేయాలని సీఎంను కోరారు అపస్మారక స్థితిలో ఉన్న ఉపాధ్యాయుడిని చుట్టుపక్కల ప్రజలు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. మల్లేష్ను అనంతపురం జీజీహెచ్కు తరలించారు. ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఆస్పత్రిలో మల్లేష్ని పరామర్శించారు. ఉపాధ్యాయుల విజ్ఞప్తిపై ప్రభుత్వం స్పందించి ఉపాధ్యాయులకు సకాలంలో వేతనాలు చెల్లించాలని ఏపీ ఎన్జీవో సంఘం నేత విజయభాస్కర్ కోరారు.