ప్రాజెక్టు అప్రూవల్ బోర్డు సమావేశంలో చర్చిస్తాం
సమగ్రశిక్ష ప్రాజెక్టులో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, డీటీపీ ఆపరేటర్లు, ఇతర సిబ్బందికి జీతాల పెంపుదలపై వచ్చే ప్రాజెక్టు అప్రూవల్ బోర్డు సమావేశంలో చర్చిస్తామని, కేంద్రంతోను కూడా సంప్రదిస్తామని మంత్రి లోకేశ్ తెలిపారు.
శాసనసభలో ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడకుదిటి ఈశ్వరరావు అడిగిన ప్రశ్నకు మంత్రి లోకేశ్ సమాధానమిస్తూ, సమగ్రశిక్షలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, డీటీపీ ఆపరేటర్ల జీతాలు దక్షిణ భారతంలోని తెలంగాణ, కేరళ, తమిళనాడు, కర్ణాటకలతో పోలిస్తే ఏపీలోనే అత్యధికంగా ఉన్నాయని అన్నారు. గతంలో 3 నెలలకోసారి జీతాలు ఇవ్వగా, ప్రస్తుతం ప్రతినెలా ఒకటో తేదీన వారికి జీతాలు చెల్లిస్తున్నట్లు చెప్పారు.
సమగ్ర శిక్ష అనేది సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ అని, ఇందులో 60 శాతం కేంద్ర ప్రభుత్వం ఇస్తుండగా, 40 శాతం రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తుందని వెల్లడించారు. అందువల్ల ఏ నిర్ణయం తీసుకున్నా కేంద్రప్రభుత్వ ఆమోదంతోనే తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.
సీజన్ హాస్టళ్ల మంజూరుకు చర్యలు తీసుకుంటాం
కర్నూలు జిల్లాలో సీజనల్ హాస్టళ్లు పెంచాలన్న ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి చేసిన విజ్ఞప్తిపై మంత్రి లోకేశ్ సమాధానమిస్తూ, కర్నూలు జిల్లాలో అవసరమైన మేర నూటికి నూరు శాతం సీజనల్ హాస్టళ్ల మంజూరుకు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
యువగళం పాదయాత్ర సందర్భంగా ఆలూరు, ఆదోని, మంత్రాలయంలో పర్యటించినపుడు ఆ ప్రాంతం ఎంత వెనుకబడి ఉందో ప్రత్యక్షంగా చూశానని అన్నారు. నంద్యాల, కర్నూలు పార్లమెంటు నడుమ ఎంతో వ్యత్యాసం కనిపించిందని తెలిపారు. నిన్న జరిగిన ఎస్ఐపీబీ సమావేశంలో కర్నూలు పార్లమెంటు పరిధిలో వస్తున్న పరిశ్రమలకు అదనపు ఇన్సెంటివ్స్ ము కూడా ప్రజాప్రభుత్వం ఆమోదించిందని వెల్లడించారు.
ఆ ప్రాంతంలో పెద్దఎత్తున పెట్టుబడులు తెచ్చే లక్ష్యంతో తాము పనిచేస్తున్నామని అన్నారు. గత ఏడాది జరిగిన డీఎస్సీలో కూడా కర్నూలు జిల్లాకు ఎక్కువ ఉపాధ్యాయ పోస్టులు మంజూరు చేసినట్లు తెలిపారు. అయినప్పటికీ టీచర్ – స్టూడెంట్ రేషియో అక్కడ తక్కువగా ఉందని అన్నారు. త్వరలో మరో డీఎస్సీ ప్రకటించబోతున్నామని శుభవార్త చెప్పారు. అందులో కర్నూలు పార్లమెంటుపై ప్రత్యేకంగా దృష్టిసారిస్తామని, ఆ ప్రాంతంలో మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పిస్తామని మంత్రి లోకేశ్ చెప్పారు.
