Free Bus: నెలరోజుల్లోగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కల్పిస్తామని మంత్రి రాంప్రసాద్రెడ్డి తెలిపారు. రవాణా, క్రీడల శాఖ మంత్రిగా ఆయన ఆదివారం ఉదయం బాధ్యతలు చేపట్టారు. సచివాలయం నాలుగో బ్లాక్లోని ఛాంబర్లో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం బాధ్యతలు స్వీకరించారు. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో అమలు అవుతున్న ఉచిత బస్సు సౌకర్యంపై సమీక్షించి తమ నిర్ణయం ప్రకటిస్తామన్నారు. ఆర్టీసీకి సంబంధించి ట్రైనింగ్ సెంటర్లపై తొలి సంతకం చేసినట్లు మంత్రి వివరించారు.
ఆర్టీసీ కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని తెలిపారు. ప్రయాణికులకు మెరుగైన సేవలందించేందుకు కృషి చేస్తామన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై ప్రత్యేక బృందంతో అధ్యయనం చేయించి వీలైనంత త్వరలో అమలు చేస్తామన్నారు. కర్ణాటక, తెలంగాణలలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం అమలవుతోందని, స్వయంగా ఆ రాష్ట్రంలో పర్యటించి అధ్యయనం చేస్తానని పేర్కొన్నారు.