Pensions in AP : ఏపీలో పింఛన్‌లు తీసుకునేవారికి శుభవార్త

Pensions in AP : ఎన్టీఆర్ భరోసా పింఛన్ పొందడానికి దూరప్రాంతాల్లో నివాసం ఉంటున్నవారు ఇబ్బందులు పడకుండా సొంత ఊరికి వెళ్లాల్సిన అవసరం లేకుండా కొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది

Published By: HashtagU Telugu Desk
Pensions In Ap

Pensions In Ap

ఆంధ్రప్రదేశ్‌లో పింఛన్ (Pensions) పొందుతున్న లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు అందించింది. ఎన్టీఆర్ భరోసా పింఛన్ (NTR Bharosa Pension Scheme) పొందడానికి దూరప్రాంతాల్లో నివాసం ఉంటున్నవారు ఇబ్బందులు పడకుండా సొంత ఊరికి వెళ్లాల్సిన అవసరం లేకుండా కొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఇకపై లబ్ధిదారులు తమ పింఛన్‌ను బదిలీ చేసుకోవడానికి అవకాశం కల్పించింది. మూడు నెలలకోసారి పింఛన్ తీసుకునే వెసులుబాటు కూడా కల్పించడంతో, ఇతర ప్రాంతాల్లో నివసించే లబ్ధిదారులకు ఇది మరింత ఉపశమనంగా మారింది.

Mahakumbh 2025 : ప్రయాగరాజ్‌లో పవిత్ర స్నానం చేసిన హరీష్ రావు

పింఛన్ బదిలీ ప్రక్రియ ఎలా?

ఎవరైనా తమ ఎన్టీఆర్ భరోసా పింఛన్‌ను బదిలీ చేసుకోవాలనుకుంటే, దగ్గరిలోని గ్రామ లేదా వార్డు సచివాలయాన్ని సందర్శించి దరఖాస్తు చేయాలి. ఇందుకు ప్రభుత్వం ప్రత్యేక వెబ్‌సైట్‌లో ఆప్షన్ కల్పించింది. లబ్ధిదారుడు తన పెన్షన్ ఐడీ, బదిలీ చేయాలనుకున్న ప్రాంతం, నివాసం ఉన్న జిల్లా, మండలం, సంబంధిత సచివాలయ వివరాలను నమోదు చేయాలి. ఈ విధానం ద్వారా పంపిణీ వ్యవస్థ మరింత మెరుగుపడుతుందని అధికారులు చెబుతున్నారు. ప్రతినెలా పింఛన్ బదిలీ చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించే అవకాశం ఉందని సమాచారం.

అనర్హుల గుర్తింపు కోసం కొత్త చర్యలు

దివ్యాంగుల కేటగిరీలో పింఛన్ పొందుతున్న లబ్ధిదారుల్లో అనర్హులను గుర్తించేందుకు ప్రభుత్వం తనిఖీలు ప్రారంభించింది. ఇప్పటికే అనర్హులపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో, వారికి ముందుగా నోటీసులు జారీ చేసి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అనర్హులకు పింఛన్‌లు అందుతున్నాయనే ఆరోపణలు వెలువడిన నేపథ్యంలో, వీరిని తొలగించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

మెడికల్ టీమ్‌లతో సరికొత్త తనిఖీలు

ఈ ప్రక్రియలో భాగంగా, హెల్త్ మరియు దివ్యాంగ కోటాలో పింఛన్ పొందుతున్న లబ్ధిదారుల అర్హతలను ప్రత్యేక మెడికల్ టీమ్‌ల ద్వారా పరిశీలిస్తున్నారు. అనర్హులుగా తేలినవారికి పింఛన్ తొలగించే చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి. మొత్తంగా చూస్తే..పింఛన్ బదిలీ సదుపాయం లబ్ధిదారులకు చాలా ఊరట కలిగించే అంశం. ఇకపై వారు తమ నివాస ప్రాంతంలోనే పింఛన్ పొందే వీలుండటంతో, ప్రయాణ ఖర్చులు, శారీరక కష్టాలు తగ్గనున్నాయి. మరోవైపు, అనర్హుల్ని తొలగించేందుకు ప్రభుత్వం చేపట్టిన తాజా చర్యలు నిజమైన లబ్ధిదారులకు మరింత న్యాయం జరిగేలా చేయనున్నాయి. ఈ నిర్ణయాలు లబ్ధిదారుల బలోపేతానికి, పింఛన్ పంపిణీ వ్యవస్థను మరింత సమర్థంగా మార్చడానికి దోహదపడనున్నాయి.

  Last Updated: 07 Feb 2025, 07:52 AM IST