TTD : తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్. తిరుపతిలోని అలిపిరి సప్త గో ప్రదక్షిణ మందిరంలో జరుగుతున్న శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమంలో పాల్గొనే భక్తులకూ ఇకపై శ్రీవారి దర్శనాన్ని కల్పించనున్నారు. హోమం టికెట్ కాకుండా రూ.300 అదనంగా చెల్లించిన వారికి సుపథం నుంచి ఆలయంలోకి వెళ్లి శ్రీవారిని దర్శించుకునే వెసులుబాటు కల్పిస్తారు. ఈవివరాలను టీటీడీ చైర్మన్ కరుణాకర రెడ్డి వెల్లడించారు. తిరుపతిలోని శ్రీగోవిందరాజస్వామి, శ్రీకోదండరామస్వామి సత్రాల స్థానంలో రూ.209.65 కోట్ల చొప్పున బడ్జెట్తో అచ్యుతం, శ్రీపథం వసతి సముదాయాల నిర్మాణానికి టెండర్లను ఆమోదించామని చెప్పారు. జార్ఖండ్లో శ్రీవారి ఆలయ నిర్మాణానికి 100 ఎకరాలను కేటాయించేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చిందని కరుణాకర రెడ్డి తెలిపారు. ఆ ప్రభుత్వం టీటీడీకి ఇచ్చిన 100 ఎకరాల్లో వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మించాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. తిరుపతిలోని శ్రీనివాసం విశ్రాంతి సముదాయంలో బస చేసే భక్తుల సౌకర్యార్థం తూర్పువైపు రూ.2 కోట్లతో ఓపెన్ డ్రైయిన్ను నిర్మించాలని టీటీడీ(TTD) నిర్ణయించింది. తిరుమలలోని యాత్రికుల కాటేజీల్లో నివాసముంటున్న పోలీసు సిబ్బందిని ఖాళీ చేయించే నిమిత్తం ప్రస్తుతమున్న పాత పోలీసు క్వార్టర్స్ను రూ.2.87 కోట్లతో అభివృద్ధి చేసేందుకు టెండరు ఖరారుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
We’re now on WhatsApp. Click to Join.
భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఈ నెల 27 నుంచి 29 వరకు తిరుపతికి 20 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్టు రైల్వే అధికారులు ప్రకటించారు. హైదరాబాద్ నుంచి తిరుపతి, తిరుపతి నుంచి కాకినాడ టౌన్ వరకు ఈ రైళ్లు నడుస్తాయి. హైదరాబాద్-తిరుపతి (07489), తిరుపతి-హైదరాబాద్ (07490), హైదరాబాద్-తిరుపతి (07449), తిరుపతి-హైదరాబాద్ (07450), హైదరాబాద్-కాకినాడ టౌన్ (07451), కాకినాడ టౌన్-హైదరాబాద్ (07452) రైళ్లను నడుపుతున్నట్టు అధికారులు వెల్లడించారు. ఈ రైళ్లు సికింద్రాబాద్, జనగామ, ఖాజీపేట, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, విజయవాడ, తెనాలి, బాపట్ల, చీరాల, రే ణిగుంట, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, సామర్లకోట, రాజమండ్రి, తణుకు, రాయనపాడు, గుడివాడ, కైకలూరు, ఆకివీడు, భీమవరం టౌన్, గుంటూరు, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, మిర్యాలగూడ, నల్గొండ స్టేషన్లలో ఆగుతాయని తెలిపారు.