నెల్లూరు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. జిల్లాలోని విడవలూరు మండలం వావిళ్ల గ్రామంలో మూడు గ్యాస్ సిలిండర్లు పేలాయి. ఈ ఘటనలో మహిళ మృతి చెందింది. వావిళ్ల గ్రామంలో టిఫిన్ సెంటర్లో మూడు గ్యాస్ సిలిండర్లు పేలాయి. మృతురాలు రమణమ్మగా పోలీసులు గుర్తించారు. గ్యాస్ సిలిండర్ల భారీ పేలుడు కారణంగా టిఫిన్ సెంటర్ కుప్పకూలిపోయింది. పేలుడు జరిగినప్పుడు రమణమ్మ ఇంట్లోనే ఉండడంతో ఆమె సజీవ దహనమైంది. ఫైర్ ఇంజన్ ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసింది. విడవలూరు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రమణమ్మ అనే మహిళ అయ్యప్ప మాల ధరించి ఉందని.. ఉదయం నుండే గ్యాస్ లీకేజీ ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఆమె అగ్గిపెట్టె వెలిగించిన క్షణంలో ఇంట్లో మంటలు వ్యాపించాయని పోలీసులు తెలిపారు. రాత్రి 7 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగిందని.. ఈ ఘటనలో రమణమ్మ తీవ్ర గాయాలపాలై మృతి చెందిందని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.