విజయవాడలో కొత్తగా ప్రారంభించిన ఓ హోటల్ ఇవాళ ఒక్కరోజు మధ్యాహ్నం 5 పైసలకే భోజనం పెడతామని కస్టమర్లకు ప్రమోషనల్ ఆఫర్ ఇచ్చింది. అయితే కేవలం 5 పైసలు (5 paise) మాత్రమే తెచ్చిన వారికి ఫుల్ మీల్స్ ఇస్తారు. అక్కడే తినేందుకు ఏర్పాట్లు కూడా చేశారు. ముందుగానే ప్రచారం చేయడంతో ఉదయం హోటల్ తెరవగానే జనం క్యూ కట్టారు. ఐదు పైసల కాయిన్ తెచ్చిన వారికి మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుందని తెలియడంతో జనం ఇళ్లలో, ఎక్కడెక్కడో వెతికి కాయిన్స్ తెచ్చారు. దీంతో హోటల్ యాజమాన్యం ఊహించని స్ధాయిలో స్పందన వచ్చింది.
ఈ ఆఫర్ ప్రకారం 5 పైసల కాయిన్ తెచ్చి వారికి 400 రూపాయల విలువగల సౌత్ ఇండియా థాలీ ఫ్రీగా ఇచ్చారు. దీంతో 5 పైసల కాయిన్స్ తో ఉదయం నుండి హోటల్ బయట జనం పడిగాపులు పడ్డారు. అయితే విపరీతంగా జనం తరలి రావడంతో వీరందరికీ ఆఫర్ వర్తింపచేయడం నిర్వాహకులకు సైతం కష్టంగా మారింది. దీంతో తొలి 50 మందికే ఈ ఆఫర్ వర్తింపజేసి మిగతా వారికి మాత్రం 200 రూపాయలకు దీన్ని వడ్డించారు. అయినా జనం స్పందన తగ్గలేదు. తద్వారా యాజమాన్యం వారు కూడా నిరుత్సాహ పడకుండా వడ్డన చేశారు. దీంతో జనం కూడా 200 పెట్టి మరీ తిని వెళ్లారు. చివరికి భోజన సమయం తర్వాత 1100 ఐదు పైస (5 paise) ల కాయిన్స్ వచ్చినట్లు హోటల్ యజమానురాలు ప్రకటించారు.