YSRCP : ఆంధ్రప్రదేశ్ శాసనసభలో టీడీపీకి ఇప్పుడు తిరుగులేని మెజారిటీ ఉంది. అయితే శాసన మండలిలో వైఎస్సార్ సీపీ ఇంకా స్ట్రాంగ్గానే ఉంది. శాసనమండలిలోని మొత్తం 58 స్థానాల్లో38 ఇంకా వైఎస్సార్ సీపీ దగ్గరే ఉన్నాయి. ఉపాధ్యాయ కోటాలో గెలిచిన వారు సాంకేతికంగా ఇండిపెండెంట్లు అయినప్పటికీ వారంతా వైసీపీ నేతలుగానే ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు అందుకే శాసన మండలిలో వైఎస్సార్ సీపీకి ఉన్న ఎమ్మెల్సీల సంఖ్య 42 అవుతుంది. టీడీపీకే ఎనిమిది మంది ఎమ్మెల్సీలు మాత్రమే ఉన్నారు. మరో ఆరు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఇప్పుడు టీడీపీ అధికార పీఠంపై ఉండటంతో.. ఈ 6 స్థానాలు ఆ పార్టీ కైవసం కావడం ఖాయం. అయినా ఇంకో నాలుగేళ్ల పాటు శాసన మండలిలో వైఎస్సార్ సీపీకే మెజారిటీ ఎమ్మెల్సీల బలం ఉంటుంది. దీని వల్ల ఏమవుతుంది? టీడీపీ ప్రభుత్వాన్ని వైఎస్సార్ సీపీ(YSRCP) ప్రభావితం చేయగలదా ?
We’re now on WhatsApp. Click to Join
వాస్తవానికి శాసనమండలిలో ఉన్న మెజారిటీతో ఏపీ ప్రభుత్వ నిర్ణయాలను వైఎస్సార్ సీపీ ప్రభావితం చేయలేదు. ఒకవేళ ఏపీ అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను శాసన మండలి తిరస్కరించినా.. ఏపీ సర్కారు ఆ బిల్లులను నేరుగా గవర్నర్ ఆమోదం కోసం పంపొచ్చు. అక్కడి నుంచి ఆ బిల్లుకు సంబంధించిన గెజిట్ను విడుదల చేయించుకోవచ్చు. ఈ అవకాశాలు ఉన్నప్పటికీ శాసనమండలిలో మెజార్టీ లేకపోవడాన్ని టీడీపీ సీరియస్గా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. రానున్న రోజుల్లో పలువురు వైఎస్సార్ సీపీ ఎమ్మెల్సీలు టీడీపీలో చేరే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. అయితే శాసన మండలి రద్దు వంటి నిర్ణయాలను సీఎం చంద్రబాబు తీసుకునే అవకాశమే లేదని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. వచ్చే ఎన్నికల నాటికి క్రమంగా శాసనమండలిలో వైఎస్సార్ సీపీ బలాన్ని తగ్గించే వ్యూహంతో టీడీపీ ముందుకు సాగుతుందని అంచనా వేస్తున్నారు.