Chandrababu Naidu ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం తన 76వ జన్మదినాన్ని జరుపుకుంటున్నారు. ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 269 అన్న క్యాంటీన్లలో నేడు ఉచితంగా భోజనాన్ని అందిస్తున్నారు. ఈ కార్యక్రమానికి అవసరమైన రూ.76 లక్షల విరాళాన్ని సీఎం సతీమణి నారా భువనేశ్వరి వ్యక్తిగతంగా అందించిన సంగతి తెలిసిందే. ఈ రోజు సీఎం చంద్రబాబు, ఆయన సతీమణి విజయవాడలోని పటమట అన్న క్యాంటీన్లో అల్పాహారం చేయనున్నారు.
సీఎం జన్మదినం సందర్భంగా ఆయనకు రాజకీయ, సినీ రంగాల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. మంత్రులు, పలు పార్టీల నాయకులు, టీడీపీ కార్యకర్తలు చంద్రబాబుకు బర్త్డే విషెస్ తెలిపారు. ప్రధాని మోదీ, పలువురు కేంద్ర మంత్రులు, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, నటుడు జూనియర్ ఎన్టీఆర్ కూడా సోషల్ మీడియా వేదికగా చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనించాలని పలువురు ఆకాంక్షించారు.
