Free Bus Travel : ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి సోమవారం అధికారులతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేసే అంశంపై అధికారులు తీసుకుంటున్న చర్యలపై ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు. ఉగాది పండగ నాటికి ఈ ఉచిత బస్సు పథకం అమల్లోకి తెచ్చేలా పనులు వేగవంతం చేయాలని అధికారులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.
అయితే ఇప్పటికే ఈ మహిళలకు ఉచిత బస్సు విధానం అమలులో ఉన్న ఢిల్లీ, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో పరిస్థితిని అధ్యయనం చేస్తామని అధికారులు వెల్లడించారు. దీనిపై వీలైనంత త్వరగా సమగ్ర నివేదికను అందజేయాలని.. అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. దీంతో అధికారులు ఆ లోపు ఇతర రాష్ట్రాల రిపోర్టు తీసుకుని చంద్రబాబుకు అందించనున్నారు. ఆ తర్వాత ప్రభుత్వం దీనిపై ప్రకటన చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ భేటీకి ఏపీ రవాణా శాఖ మంత్రి రాం ప్రసాద్రెడ్డి, డీజీపీ ద్వారకా తిరుమలరావు, ఆర్టీసీ ఎండీ సహా ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.
కాగా, ఉచిత బస్సు ప్రయాణం అమలుకు సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం ముగ్గురు మంత్రులతో కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. అయితే అధికారులు ఇచ్చిన నివేదికను పరిశీస్తున్న కేబినెట్ సబ్ కమిటీ.. ఇప్పటికే ప్రాథమికంగా కొన్ని అంచనాలు వేసింది. ఈ ఉచిత బస్సు పథకాన్ని అందుబాటులోకి తీసుకువస్తే.. రోజుకు 10 లక్షల మంది ప్రయాణికులు ఎక్కుతారని అంచనా వేస్తున్నారు. ఇందుకోసం ప్రస్తుతం రాష్ట్రంలో నడుస్తున్న బస్సులకు అదనంగా మరో 2వేల బస్సులు, 11వేలకుపైగా సిబ్బందిని అవసరం అవుతాయని పేర్కొన్నారు.
Read Also: Fact Check : ‘‘కాంగ్రెస్ సర్కారు ఆరు గ్యారెంటీలు బోగస్’’ అని కడియం శ్రీహరి కామెంట్ చేశారా ?