Fake Job Notification: రైల్వే జాబ్స్కు చాలా క్రేజ్ ఉంటుంది. వాటి కోసం ఎంతోమంది యువత ఆసక్తి చూపుతుంటారు. దీన్నే కొందరు సొమ్ము చేసుకున్నారు. ఎంతోమందికి కుచ్చుటోపీ పెట్టారు. ఇలా మోసపోయిన వారిలో పలువురు ఏపీ వాస్తవ్యులు కూడా ఉన్నారు. ఫేక్ నోటిఫికేషన్, ఫేక్ వెబ్సైట్తో నిరుద్యోగులను నిండా ముంచిన ఈ వ్యవహారంపై వివరాలివీ..
We’re now on WhatsApp. Click to Join
రైల్వే స్టేషన్లలో టికెట్ కౌంటర్ వద్ద రద్దీని నియంత్రించేందుకు ఆటోమేటిక్ టికెట్ వెండింగ్ మెషీన్ల (ఏటీవీఎం)ను ఏర్పాటు చేశారు. ఏటీవీఎంలను నిర్వహించేందుకు విజయవాడ డివిజన్ పరిధిలోని 26 రైల్వేస్టేషన్ల పరిధిలో 59 మంది సహాయకులను నియమించేందుకు ఇటీవల రైల్వేశాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీన్ని అదునుగా చేసుకొని మోసగాళ్లు రంగంలోకి దిగారు. తాము ఒక ఫేక్ రైల్వే జాబ్ నోటిఫికేషన్ను విడుదల చేశారు. ఒక ఫేక్ వెబ్సైటును క్రియేట్ చేసి.. దాని ద్వారా దరఖాస్తులు స్వీకరించారు. ఒక్కో పోస్టు కోసం అభ్యర్థుల నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేశారు. ఈ 59 జాబ్స్ భర్తీ చేయగానే.. తాము ఇంకో జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని మోసగాళ్లు తమను ఆశ్రయించిన నిరుద్యోగులకు నమ్మబలికారు. ఫ్యూచర్లో జాబ్స్ కావాలంటే.. ఇప్పుడే అడ్వాన్సు ఇచ్చి రిజర్వ్ చేసుకోవాలని సూచించారు. ఇది నిజమేనని నమ్మిన ఎంతోమంది భూములు అమ్ముకొని, అప్పులు చేసి మరీ డబ్బులు తెచ్చి మోసగాళ్ల ముఠాకు కట్టారు. ఈ వ్యవహారంలో కేటుగాళ్లకు కొందరు కీలక వ్యక్తులు సహకరించారని తెలిసింది. అందువల్లే జనం అంతగా ఎగబడి డబ్బులు కట్టారని సమాచారం. జాబ్స్ కోసం ఇలా డబ్బులు కట్టిన వాళ్లకు కేటుగాళ్లు నకిలీ కాల్లెటర్లు కూడా పంపించారు. తీరా ఉద్యోగంలో(Fake Job Notification) చేరదామని విజయవాడ రైల్వే స్టేషన్కు వెళ్లిన నిరుద్యోగులు.. అసలు విషయం తెలుసుకొని లబోదిబోమన్నారు.
తాము భర్తీ చేసినవి పర్మినెంట్ జాబ్స్ కావని.. ఏటీవీఎం యంత్రాల వద్ద పనిచేసేందుకు ఫెసిలిటేటర్ పోస్టులు మాత్రమేనని రైల్వేశాఖ స్పష్టం చేసింది. ఆ జాబ్లో చేరేవారికి జీతాలు ఉండవని తెలిపింది. ఏటీవీఎంల నుంచి అమ్మిన టిక్కెట్ల డబ్బుల ఆధారంగా.. అందులో నుంచి 3 శాతం కమిషన్ లభిస్తుందని పేర్కొంది. సాధారణంగా ఇలాంటి ఉద్యోగాలు రిటైర్డ్ రైల్వే ఉద్యోగులే చేస్తారని చెప్పింది. ఫేక్ జాబ్ నోటిఫికేషన్లు, ఫేక్ వెబ్ సైట్లు చూసి మోసపోవద్దని నిరుద్యోగులకు రైల్వే శాఖ సూచించింది.