Margani Bharat Ram : శుక్రవారం అర్ధరాత్రి రాజమహేంద్రవరం నగరం వీఎల్ పురంలోని మార్గాని ఎస్టేట్స్లో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్ ఎన్నికల ప్రచార రథానికి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పుపెట్టారు. దీంతో ఆ రథం పూర్తిగా కాలిపోయింది. పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో స్థానికులు మార్గాని భరత్కు సమాచారం అందించారు. హుటాహుటిన మార్గాని భరత్, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.
We’re now on WhatsApp. Click to Join
ఈ ఘటనపై భరత్ రామ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని రాష్ట్ర డీజీపీ ద్వారకా తిరుమలరావు దృ ష్టికి తీసుకెళ్లి నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. సీసీ కెమెరా ఫుటేజీ ద్వారా పోలీసులు పూర్తి విచారణ చేయాలని కోరారు. ఈ ఘటనకు ఉసిగొల్పిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని భరత్రామ్ డిమాండ్ చేశారు. రాజమహేంద్రవరంలో ఇలాంటి విష సంస్కృతి గతంలో ఎప్పుడూ లేదన్నారు. ఇటీవల మోరంపూడి ఫ్లై ఓవర్ బ్రిడ్జి శిలాఫలకం ధ్వంసం, ఇళ్ల పైకి రాళ్లతో దాడులు, కోటిలింగాలపేటలో వైఎస్సార్ సీపీకి చెందిన యువనేతపై దాడి లాంటి దారుణాలకు పాల్పడుతున్నారనే విషయాన్ని ప్రజలు గమనించాలని ఆయన కోరారు.
మోరంపూడి ఫ్లై ఓవర్ బ్రిడ్జి శిలాఫలకాన్ని కొందరు ధ్వంసం చేస్తున్న వీడియోలు, సీసీ పుటేజీ, పెన్ డ్రైవ్ తదితర ఆధారాలను ఈనెల(జూన్) 11న అడిషనల్ ఎస్పీ సార్కర్కు మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్(Margani Bharat Ram) అందజేశారు. సీతంపేట మూలగొయ్యికి చెందిన సాయి అనే యువకుడిపై కొంతమంది మారణాయుధాలతో దాడిచేశారని అడిషనల్ ఎస్పీకి మాజీ ఎంపీ వివరించారు.ఈమేరకు అడిషనల్ ఎస్పీ సార్కర్ కు లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు.