Site icon HashtagU Telugu

RK Roja : లడ్డూ వివాదంపై మాజీ మంత్రి రోజా కీలక వ్యాఖ్యలు

Former minister Roja key comments on the laddu controversy

Former minister Roja key comments on the laddu controversy

Tirumala Laddu Controversy: మాజీ మంత్రి రోజా తిరుమల లడ్డూ వివాదంపై స్పదించారు. చంద్రబాబు 100 రోజుల పాలనలో జరిగిన అఘాయిత్యాలను కప్పి పుచ్చేందుకు డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నారని రోజా వ్యాఖ్యానించారు. వరదలు, మహిళలపై వరుసగా జరుగుతున్న దాడులు, వైసీపీ నాయకులపై దాడులు, ఇచ్చిన హామీలు చంద్రబాబు నెరవేర్చలేకపోయాడని విమర్శించారు. ఇన్ని తప్పులు చేసిన చంద్రబాబు ప్రజల దృష్టి మళ్లించే విధంగా లడ్డు వివాదాన్ని తెరపైకి తెచ్చారన్నారు. తన రాజకీయ లబ్ధి కోసం వెంకటేశ్వర స్వామిని సైతం చంద్రబాబు వదలడం లేదన్నారు చెడ్డ పేరు వచ్చిన ప్రతిసారి ఇలాంటి వివాదాలు ఏదొకటి తెరపైకి తెచ్చి, పార్టీ నేతలతో ప్రచారం చేయిస్తున్నారని విమర్శలు గుప్పించారు. చంద్రబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలను ప్రజలు ఖండిస్తున్నారు, చీకొడుతున్నారని రోజా వ్యాఖ్యానించారు.

రెండు నెలల అనంతరం సీఎం స్టేట్మెంట్ ఇవ్వడం వెనుక ఆంతర్యం ఏంటీ?..

టీటీడీ స్వయం ప్రతిపత్తి సంస్థ, సీఎంకు ఎలాంటి సంబంధం ఉండదని మంత్రి లోకేష్ అంటున్నారని తెలిపారు. జగన్ అనిమల్ ఫ్యాట్ మిక్స్ చేయించినట్లుగా చంద్రబాబు సృష్టిస్తున్నారన్నారు. చంద్రబాబు ఆరోపణలు సమంజసం కాదన్నారు. ఈఓ శ్యామల రావు బాధ్యతలు తీసుకున్న వెంటనే స్వచ్ఛమైన నెయ్యిని వాడుతున్నట్లు తెలిపారని.. అనంతరం జులై 23న వెజిటబుల్ ఆయిల్ మిక్స్ చేశారు… అందుకే నెయ్యిని వెనక్కు పంపాం అంటూ ఈవో స్టేట్మెంట్ ఇచ్చారన్నారు. రెండు నెలల అనంతరం సీఎం స్టేట్మెంట్ ఇవ్వడం వెనుక ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు. టీడీపీ కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి నింద వేశారని పేర్కొన్నారు. మళ్లీ శ్యామలరావుపై ఒత్తిడి తెచ్చి ప్రెస్ మీట్ పెట్టించారని ఆమె తెలిపారు. మీ ప్రభుత్వంలో బయటపడిన అంశం కాబట్టి బాధ్యులు ఎవరు? సీఎం చంద్రబాబునా? ఈవో శ్యామలరావునా అంటూ రోజా ప్రశ్నించారు.

లడ్డూ రుచిలో తేడా ఉంటే ఆ రోజే కంప్లైంట్ ఇవ్వాలి కదా?..

జగన్ అధికారంలో ఉన్న సమయంలో ప్రధాని మోడీ, సీజేఐలు, చంద్రబాబు సైతం ఫ్యామిలీతో రావడం జరిగిందన్నారు. లడ్డూ రుచిలో తేడా ఉంటే ఆ రోజే కంప్లైంట్ ఇవ్వాలి కదా అంటూ ప్రశ్నించారు. ఐదేళ్లలో ఏదో జరిగిందని నింద వేయడానికి కల్తీ నెయ్యి అంటూ ప్రచారం చేస్తున్నారన్నారు. టీటీడీ ప్రతిష్టను దిగజార్చే విధంగా చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. బీజేపీ నాయకులు సైతం గత పాలక మండలిలో ఉన్నారు… అప్పుడు ఎందుకు కంప్లైంట్ చేయలేదని ప్రశ్నలు గుప్పించారు. ప్రస్తుతం టీడీపీలో ఉన్న వేమిరెడ్డి ప్రశాంతి, పార్థసారథి గత పాలకమండలిలో ఉన్నారు… తప్పు చేశారా లేదా వాళ్లైనా చెప్పాలన్నారు. ఈరోజు ప్రాయశ్చిత దీక్ష చేస్తానని పవన్ కళ్యాణ్ ప్రకటించారని, ప్రాయిశ్చిత్తం ఎవరు చేస్తారని ఆమె ప్రశ్నించారు. తప్పుచేసినవారు చేస్తారు అంటే ప్రభుత్వంలో ఉన్నామని, టీడీపీ పాపంలో భాగం ఉంది కనుక దీక్ష చేస్తున్నానని ఆయనే ఒప్పుకున్నారని రోజా పేర్కొన్నారు.

Read Also: Hyderabad : రన్నింగ్ బస్సులో యువతీ ఫై లైంగిక దాడి