టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో కదిరి, ఏలూరు నియోజకవర్గాలకు చెందిన వైసీపీ నేతలు తెలుగు దేశంలో చేరారు. సత్యసాయి జిల్లా కదిరి అసెంబ్లీ నియోజకవర్గం నుండి సుమారు 200 కుటుంబాలకు చెందిన వైసీపీ నాయకులు, కార్యకర్తలు టీడీపీలో చేరారు. అదే విధంగా ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మాజీ మంత్రి మరడాని రంగారావు పార్టీలో చేరారు. ఆయన గతంలో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేశారు. ఆయనతో పాటు ఏలూరు నియోజకవర్గానికి చెందిన ఆటో యూనియన్ లీడర్ నగరబోయిన లీలా కృష్ణ పార్టీలో చేరారు. వీరి అనుచరులు, మద్దతు దారులు 100 మందికి పైగా తెలుగు దేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వ విధానాలతో తాము ఎలా నష్టపోయామో రెండు నియోజకవర్గాల నేతలు వివరించారు. కదిరిలో రోడ్ల పరిస్థితి దారుణంగా ఉందని.. తమ పక్క నియోజకవర్గం అయిన పులివెందులలో కూడా తీవ్ర ప్రజా వ్యతిరేకత ఉందని పార్టీలో చేరిన కార్యకర్తలు తెలిపారు. స్వేచ్చగా ఓటింగ్ జరిగితే పులివెందులలో కూడా జగన్ కు ఇబ్బంది తప్పదని కదిరి నుంచి వచ్చిన కార్యకర్తలు తెలిపారు. పోలీస్ ఫైన్ లు, పన్నులు, పెట్రో ధరలు, బాదుడుతో తాము ఎంత నష్టపోతున్నామో ఆటో యూనియన్ నేతలు చంద్రబాబకు వివరించారు. అన్ని వర్గాల్లో వైసీపీ ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందని.. ప్రజలు తీవ్ర కష్టాలు పడుతున్నారని వారు తెలిపారు.
Also Read: Hyderabad : హైదరాబాద్లో రోజుకు 21 వేల బిర్యానీలను డెలివరీ చేస్తున్న స్విగ్గీ