మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుపై ఏపీ పోలీసులు కేసులు నమోదు చేశారు. ఆయనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. పల్నాడు జిల్లాలోని చిలకలూరిపేట మంచి నీటి చెరువు వద్ద ఎన్టీఆర్ సుజల పథకం ప్రారంభ సమయంలో జరిగిన రభస కేసులకు దారితీసింది. టౌన్ ప్లానింగ్ సూపర్ వైజర్ ను టీడీపీ నేతలు కులం పేరుతో దూషించారని మునిసిపల్ సూపర్వైజర్ కోడిరెక్క సునీత అర్బన్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆ క్రమంలో పుల్లారావుతో పాటు పలువురు టీడీపీ నేతలపై ఎస్సీ, ఎస్టీ పీఏఓ యాక్ట్ 323, 34, 353, 506, 509 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందులో ఏ1గా పుల్లారావు, ఏ2గా మదన్ మోహన్, ఏ3గా బండారుపల్లి సత్యనారాయణ, ఏ4గా కౌన్సిల్ ప్రతిపక్ష నాయకుడు శ్రీనివాసరావు, ఏ5గా కరీముల్లా ఉన్నారు.
మాజీ మంత్రులను అరెస్ట్ చేస్తోన్న జగన్ సర్కార్ ఇంత కాలం పాటు ప్రత్తిపాటి పుల్లారావును చూసీచూడనట్టు వదిలేసింది. హాయ్ ల్యాండ్, అగ్రిగోల్డ్ కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటోన్న ఆయనపై చర్యలు తీసుకుంటామని గతంలోనే జగన్ వార్నింగ్ ఇచ్చారు. ఎన్నికల సందర్భంగా ప్రతి వేదికపైనా ఆ విషయాన్ని జగన్ ప్రచారం చేశారు. తీరా, అధికారంలోకి వచ్చిన తరువాత హాయ్ ల్యాండ్, అగ్రిగోల్డ్ అంశాన్ని తెరవెనక్కు తీసుకెళ్లారు. మాజీ మంత్రులు అచ్చెంనాయుడు, కొల్లు రవీంద్ర, తదితరులను అరెస్ట్ చేసిన సమయంలో పుల్లారావును కూడా అరెస్ట్ చేస్తారని ప్రచారం జరిగింది.
వైసీపీలోని కీలక నేతలతో మాజీ మంత్రికి ఉన్న సాన్నిహిత్యం కారణంగా ఇంత కాలం పాటు అరెస్ట్ కాకుండా తప్పించుకున్నారని ఆ పార్టీలోని వాళ్లే మాట్లాడుకుంటున్న సందర్భాలు ఉన్నాయి. ఒకానొక సందర్బంలో గుంటూరు ఎంపీగా వైసీపీ నుంచి ప్రత్తిపాటి పుల్లారావు రంగంలోకి దిగుతారని ప్రచారం కూడా జరిగింది. కానీ, హఠాత్తుగా ఇప్పుడు ఆయనపై ఆట్రాసిటీ కేసు నమోదు అయింది. ఇక ఆయన్ను అరెస్ట్ చేసే అవకాశం ఉందని టాక్ నడుస్తోంది.