AP Land Registration Charges: కొత్త జిల్లాల్లో.. వీర బాదుడు షురూ..!

  • Written By:
  • Publish Date - April 6, 2022 / 09:45 AM IST

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త జిల్లాలు ప్రారంభ‌మైన సంగ‌తి తెలిసిందే. గ‌తంలో రాష్ట్రంలో 13 జిల్లాలు ఉండ‌గా, కొత్త‌గా మ‌రో 13 జిల్లాల‌ను ఏర్పాటు చేయ‌డంతో, ఏపీలో మొత్తం జిల్లాల సంఖ్య 26కు చేరింది. ఈ క్ర‌మంలో 26 జిల్లాల్లో పాలన ఆరంభమైన సంగ‌తి తెలిసిందే. ఇక అస‌లు మ్యాట‌ర్ ఏంటంటే రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటుతో అక్క‌డ‌ భూముల రిజిస్ట్రేషన్ చార్జీలను ఆమాంతం పెరిగాయి. ఈ పెంపు 15 శాతం నుంచి 75 శాతం వరకు ఉండ‌గా, సగటున 20 శాతం మేరకు భారం ప‌డ‌నుంది.

ఇక ముఖ్యంగా కొత్త జిల్లా కేంద్రాలు, వాటికి ఆనుకుని ఉండే శివారు, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న భూముల‌కు సంబంధించి రిజిస్ట్రేష‌న్ చార్జీలు భారీగా పెంచేసింది రాష్ట్ర ప్ఱ‌భుత్వం. ఈ క్ర‌మంలో తాజాగా భూముల‌ రిజిస్ట్రేషన్ చార్జీలను పెంచుతూ రాష్ట్ర స్టాంపులు, రిజిస్ట్రేషన్ల మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీచేసింది. అయితే ఇక్క‌డ మ‌రో ముఖ్య‌మైన విషయం ఏంటంటే ఈ పెరుగుదల కొత్త జిల్లాల్లోనే కాకుండా, పాత జిల్లాల్లో కూడా పెరిగే అవకాశం ఉంది.

రిజిస్ట్రేష‌న్ పెంపుద‌ల ఆగస్టు నుంచి అమల్లోకి రానుందని స‌మాచారం. ఈ క్ర‌మంలో ఒక్కో జిల్లాలో ఒక్కో ర‌కంగా ఈ పెంపుదల ఉండే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. దీంతో ఇప్ప‌టికే జిల్లా కేంద్రాలు, పక్కనున్న శివారు ప్రాంతాలు, ఆనుకునివున్న గ్రామీణ ప్రాంతాల్లో సబ్‌రిజిస్ట్రార్లు ఎక్కడికక్కడ విలువలు ఎంత పెంచాలన్నదానిపై ప్రతిపాదనలు తయారు చేయ‌గా, దానిపై జాయింట్ కలెక్టర్ నేతృత్వంలోని కమిటీ ఆమోదం తెలిపింది. ఆయా ప్రాంతాల్లోని అభివృద్ధి, అక్కడ వాస్తవ మార్కెట్ విలువలు, తదితరాలను దృష్టిలో ఉంచుకుని ఈ రిజిస్ట్రేషన్ల చార్జీలను పెంచారు.