Andhra deluge: కన్నీటిని మిగిల్చిన నీటి ప్రాజెక్టు

ఏపిలో కురుస్తున్న భారీ వర్షాలు అక్కడి ప్రజల్లో తీవ్ర విషాదాన్ని నింపుతున్నాయి.

Published By: HashtagU Telugu Desk

ఏపిలో కురుస్తున్న భారీ వర్షాలు అక్కడి ప్రజల్లో తీవ్ర విషాదాన్ని నింపుతున్నాయి. వర్షానికి తడిచిన గోడలు కూలిపోయి కొందరు చనిపోగా, వరదల్లో కొట్టుకుపోయి మరికొందరు ప్రాణాలు వదిలారు. చెరువులు, వాగులు పొంగడంతో ప్రాణ నష్టం, పంట నష్టం, ఆస్థి నష్టం వాటిల్లుతోంది.

భారీగా కురుస్తున్న వర్షాలకు కడప జిల్లాలోని చెయ్యేరు నది పై నిర్మించిన అన్నమయ్య ప్రాజెక్టు కట్ట పూర్తిగా కొట్టుకుపోయింది. దీనివల్ల ప్రాజెక్టు పక్కనున్న అనేక గ్రామాలు మునిగిపోయి అనేక మంది ప్రాణాలు తీసింది. అక్కడి గ్రామాల్లోని ప్రజల వంట సామగ్రి, తిండిగింజలు, కట్టుబట్టలు, విలువైన బంగారు ఆభరణాలు, నగదు, రిఫ్రిజిరేటర్స్‌, బీరువాలు, మంచాలు ఇలా సర్వం వరదలో కొట్టుకుపోయాయి.

Also Read: ఇద్దరు ముఖ్యమంత్రులు ఒకే వేదిక మీద!

అన్నమయ్య ప్రాజెక్టు 2001లో వినియోగంలోకి వచ్చింది.
ఈ ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 2.23 టీఎంసీలు. పక్కనే ఉన్న పింఛా ప్రాజెక్టుకు 38 వేల క్యూసెక్కులు ఉన్న వరదనీరు రాత్రి లక్ష క్యూసెక్కులు దాటింది. మరోవైపు మాండవ్య నది నుంచి కూడా అన్నమయ్య ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. ఈ డ్యామ్‌ స్విల్‌వే డిశ్చార్జి కెపాసిటీ 2.85 లక్షల క్యూసెక్కులు కాగా, అది 3.50 లక్షల క్యూసెక్కులకు చేరింది. ఏ క్షణమైనా కట్ట తెగిపోయే ప్రమాదం ఉందని అధికారులు రెడ్‌ అలర్ట్‌ ప్రకటించారు. ఈ హెచ్చరికలు వచ్చిన గంటలోపే భారీశబ్దంతో డ్యామ్‌ కట్ట కొట్టుకుపోయింది. రాజంపేట మండలం రామాపురం చెక్‌పోస్టు దగ్గర వరద కడప-తిరుపతి జాతీయ రహదారిని ముంచెత్తింది.

Also Read: అమరావతి జోష్..షా ఎత్తుగడ.!

ఆ సమయంలో అటుగా వచ్చిన పల్లె వెలుగు బస్సు పూర్తిగా నీటిలో మునిగిపోయింది. బస్సులోని 12 మందిలో ముగ్గురి మృతదేహాలను బయటకు తీశారు. ఇద్దరు గుల్లంతు అయ్యారని అధికారులు తెలిపారు.

  Last Updated: 21 Nov 2021, 11:24 PM IST