Site icon HashtagU Telugu

Guillain-Barré Syndrome (GBS) : ఏపీలో ఫస్ట్ మరణం

First Death In Ap Due To Gu

First Death In Ap Due To Gu

ఏపీలో గులియన్-బారే సిండ్రోమ్ Guillain-Barré Syndrome (GBS) వ్యాధి పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా గుంటూరు సర్వజన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఓ మహిళ మరణించడం కలకలం రేపింది. మృతురాలు ప్రకాశం జిల్లాకు చెందిన వ్యక్తి కాగా, రెండు రోజుల క్రితం తీవ్ర జ్వరంతో ఆసుపత్రిలో చేరింది. అనంతరం కాళ్లు చచ్చుబడిపోవడం, నడవలేకపోవడం వంటి లక్షణాలు తీవ్రతరమవడంతో ఆమె ఆరోగ్యం విషమించింది. చివరకు చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. గులియన్-బారే సిండ్రోమ్ వ్యాధితో రాష్ట్రంలో ఇదే మొదటి మరణం కావడంతో ప్రజల్లో భయాందోళనలు మొదలయ్యాయి.

ఏపీ ఆరోగ్య శాఖ ఇటీవల విడుదల చేసిన నివేదిక ప్రకారం.. రాష్ట్రంలో ఇప్పటివరకు 17 GBS కేసులు నమోదయ్యాయి. గుంటూరు జిల్లాలోనే నాలుగు కేసులు గుర్తించగా, ఏలూరు, ప్రకాశం, పల్నాడు, కాకినాడ జిల్లాల్లోనూ ఈ వ్యాధి కేసులు వెలుగులోకి వచ్చాయి. ఈ వ్యాధి అంటువ్యాధి కాకపోయినా, అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో GBS చికిత్సకు అవసరమైన ఇమ్యూనోగ్లోబిన్ ఇంజెక్షన్లు అందుబాటులో ఉన్నాయని, వ్యాధిగ్రస్తులకు తగినంత వైద్యం అందిస్తున్నామని అధికారులు తెలిపారు.

GBS వ్యాధి లక్షణాలు మరియు ప్రభావం

గులియన్-బారే సిండ్రోమ్ అనేది నరాలకు సంబంధించిన వ్యాధి. ఇది శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ నరాలను దాడి చేయడం వల్ల ఉత్పన్నమవుతుంది. ఈ వ్యాధి లక్షణాలు ముఖ్యంగా చేతులు, కాళ్లలో నొప్పి, మడమలు మరియు వేళ్లలో సూదులతో పొడిచినట్టు అనిపించడం, కండరాల బలహీనత మొదలై నడవలేకపోవడం వంటివిగా ఉంటాయి. అలాగే, శరీరంలోని నరాలు ప్రభావితమైతే శ్వాస తీసుకోవడంలో కూడా సమస్యలు ఏర్పడే అవకాశముంది. కొంతమందికి నోరు వంకరపడటం, మాట్లాడటంలో ఇబ్బంది, గట్టిగా నమలలేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

GBS వ్యాప్తి ఎలా జరుగుతుంది?

GBS వ్యాధి ఏదైనా ఇన్‌ఫెక్షన్ లేదా వైరల్ సంక్రమణ తర్వాత సంభవించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా కలుషితమైన నీరు, శుభ్రంగా లేని ఆహారం ద్వారా వ్యాధి ప్రబలవచ్చని నిపుణులు చెప్తున్నారు. సాధారణంగా ఇది అరుదుగా వచ్చే వ్యాధిగా పరిగణించబడుతుంది, అయితే ఇటీవల కేసుల పెరుగుదల వల్ల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.

జాగ్రత్తలు మరియు నివారణ మార్గాలు

GBS వంటి వ్యాధుల నుంచి రక్షణ పొందడానికి సరైన జాగ్రత్తలు తీసుకోవాలి. కాచి చల్లార్చిన నీటినే తాగాలి, మాంసాన్ని బాగా ఉడికించి తినాలి. కూరగాయలు, పండ్లను నీటితో బాగా శుభ్రపరిచిన తర్వాతే ఉపయోగించాలి. వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం ద్వారా అనేక రకాల ఇన్‌ఫెక్షన్ల నుంచి రక్షణ పొందవచ్చు. GBS లక్షణాలు కనబడితే వెంటనే వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవడం అత్యంత అవసరం. శరీరంలో ఏదైనా అసాధారణ లక్షణాలు కనబడితే నిర్లక్ష్యం చేయకుండా తక్షణమే వైద్య పరీక్షలు చేయించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.