ఆంధ్రప్రదేశ్లోని ఓ ఆలయంలో రామనవమి వేడుకల సందర్భంగా అగ్నిప్రమాదం జరిగింది. పశ్చిమగోదావరి జిల్లాలో గురువారం రామనవమి వేడుకల సందర్భంగా ఆలయంలో అగ్నిప్రమాదం జరిగింది. దువ్వలోని వేణుగోపాల స్వామి ఆలయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆలయ ప్రాంగణంలో ఉత్సవాల కోసం నిర్మించిన మండపం అగ్ని ప్రమాదం కారణంగా పూర్తిగా దగ్ధమైంది. భక్తులు తమను తాము కాపాడుకోవడం కోసం పరుగులు తీశారు. దీంతో కొంత తొక్కిసలాట జరిగి పలువురికి గాయాలయ్యాయి.
ఆలయ ప్రాంగణం నుంచి భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. స్థానికుల సాయంతో అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పారు. కొందరు భక్తులు పటాకులు కాలుస్తుండగా మండపంలో మండుతున్న క్రాకర్ పడటంతో ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో నిర్వాహకులు, భక్తులు ఊపిరి పీల్చుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.