ఏపీ ఉద్యోగులకు సీఎం జగన్మోహన్ రెడ్డి `టైమ్ సెన్స్`ను నేర్పించబోతున్నారు. ఆ క్రమంలో జనవరి ఒకటో తేదీ నుంచి `ఫేస్ రికగ్నేజేషన్`( Facial Recognition) పద్ధతిని అమలు చేస్తున్నారు. అన్ని స్థాయిల్లోని ఉద్యోగులకు ఈ పద్ధతి ఉండేలా ఏపీ సర్కార్ కొత్త సాఫ్ట్ వేర్ ను తయారు చేసింది. కొత్త సంవత్సరం మొదటి రోజు నుంచి విధిగా ఈ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. తొలి విడత జిల్లా స్థాయి వరకు `ముఖ గుర్తింపు` పద్ధతిని తీసుకెళతారు. ఆ తరువాత జనవరి 16వ తేదీ నుంచి మండల, గ్రామ స్థాయి వరకు ఈ విధానాన్ని పగడ్బందీగా అమలు చేయాలని జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు.
Also Read : Ap Employees : ఏపీ ఉద్యోగుల నోటి దురుసు! కూలీలు అంటే అంత అలుసా.!
ప్రధానంగా టీచర్లు, సచివాలయ ఉద్యోగులు ఎక్కువ భాగం టైమ్ కు ఆఫీస్(Time to Office) లకు చేరుకోరు. వ్యక్తిగత వ్యాపారాలు, పనుల మీద బిజీగా ఉంటారు. ప్రవృత్తిగా మాత్రమే ఉద్యోగాన్ని చూసే వాళ్లు చాలా మంది ఉన్నారు. వృత్తిగా భావించకుండా లంచాల కోసం పనిచేసే వాళ్ల జాబితా కూడా ఎక్కువగానే ఉంది. ఆ విషయాన్ని టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా ఏపీ ప్రభుత్వం గ్రహించింది. అందుకే, నీతివంతమైన, పారదర్శకతతో కూడిన క్రమశిక్షణ గల పరిపాలన అందించాలని జగన్మోహన్ రెడ్డి భావించారు. ఆ క్రమంలో హాజరు కోసం `ముఖ గుర్తింపు`(Facial Recognition) ను ఉద్యోగులకు విధిగా మార్చేశారు.
ప్రభుత్వం ఉద్యోగులను టైమ్ కు ఆఫీస్(Time to Office) లకు రప్పించే విషయంలో స్వర్గీయ వైఎస్, చంద్రబాబుతో సహా రాజకీయదురంధరులుగా పేరుగాంచిన ఏపీ సీఎంలు అందరూ విఫలం అయ్యారు. తెలంగాణ రాష్ట్రంలోనూ అదే పరిస్థితి. అందుకు భిన్నంగా జగన్మోహన్ రెడ్డి ఉద్యోగుల విధులను గాడిలో పెట్టే సాహసం చేస్తున్నారు. వాళ్లకు క్రమశిక్షణ, టైమ్ సెన్స్ నేర్పించడానికి సన్నద్ధం అయ్యారు. ఆ క్రమంలో బోధనేతర పనుల నుంచి ఉపాధ్యాయులను తప్పించారు. అదనపు టైమ్ పనిచేస్తున్నామని చెప్పే టీచర్లకు ముందుగానే జగన్మోహన్ రెడ్డి బంధం వేశారు. దీంతో అనివార్యంగా జనవరి ఒకటో తేదీ నుంచి టైమ్ కు ఆఫీస్ లకు చేరుకోవాల్సిందే. లేటైయితే, ఒక పూట సెలవుగా పరిగణించాలని కూడా మార్గదర్శకాలను తయారు చేస్తున్నారు. రాబోవు రోజుల్లో మరిన్ని సంస్కరణలు తీసుకురావడం ద్వారా ఉద్యోగుల్లో వృత్తి నైపుణ్యాన్ని పెంచడంతో చిత్తశుద్ధిని అలవాటు చేయాలని జగన్ భావిస్తున్నారు.
వర్క్ ఫర్ పే (పనికి తగ్గ వేతనం) విధానాన్ని అమలు చేయాలని చాలా కాలంగా కేంద్రం కూడా ఆలోచిస్తోంది. ఆ క్రమంలో కార్మిక, ఉద్యోగ చట్టాలను మార్చేశారు. రాబోవు రోజుల్లో కేంద్రం కూడా వర్క్ ఫర్ పే విధానం దిశగా వెళ్లబోతుందని టాక్. అమెరికా, చైనా లాంటి దేశాల్లో ఇదే విధానం ఉంది. ఆ పద్ధతిని అవలంభించడం ద్వారా తెల్ల ఏనుగుల మాదిరిగా ఉండే పలువురు ఉద్యోగుల బద్ధకాన్ని వదిలించాలని కేంద్రం భావిస్తుందట. ఆ దిశగా జగన్మోహన్ రెడ్డి సర్కార్ కూడా ఆలోచనలో పడింది. అందులో భాగంగా తొలి విడత `ముఖ గుర్తింపు` పద్ధతిని తీసుకొస్తోంది. ఆ తరువాత పనికి తగిన వేతనాన్ని అమలులోకి తీసుకొచ్చే అవకాశం లేకపోలేదు. అదే జరిగితే, జీతభత్యాల రూపంలో బడ్జెట్ లో 80శాతం వాటాను మింగేస్తోన్న ఉద్యోగుల నుంచి ఆ మేరకు ఉద్యోగుల సేవ సమాజానికి అందుతుంది.
Also Read : AP Employees: ఏపీ ఉద్యోగుల కోర్కెలకు జగన్ కళ్లెం!