కుడా చైర్మన్ పదవిపై ఉత్కంఠ : మంత్రి పేరు వాడుకుంటూ తలాటం సత్య చక్రం?

మంత్రి కందుల దుర్గేష్‌కు అత్యంత సన్నిహితుడినని చెప్పుకుంటూ, ఆయన పేరును వాడుకుని తలాటం సత్య పలు 'సెటిల్మెంట్లు' చేస్తున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.

Published By: HashtagU Telugu Desk
Kakinda Kuda

Kakinda Kuda

కాకినాడ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (KUDA) చైర్మన్ పదవి రేసులో ఉన్న తలాటం సత్య వ్యవహారశైలి ఇప్పుడు జనసేన పార్టీలో పెద్ద చర్చకు దారితీసింది. మంత్రి కందుల దుర్గేష్‌కు అత్యంత సన్నిహితుడినని చెప్పుకుంటూ, ఆయన పేరును వాడుకుని తలాటం సత్య పలు ‘సెటిల్మెంట్లు’ చేస్తున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా గత దీపావళి బాణసంచా షాపుల కేటాయింపు మరియు ఎగ్జిబిషన్ గ్రౌండ్ల నిర్వహణలో తన బినామీల ద్వారా ఆర్థికంగా లాభపడ్డారని, కేవలం కమిషన్ల కోసం పార్టీ పరువును పణంగా పెడుతున్నారని స్థానిక నేతలు మండిపడుతున్నారు. మంత్రి గారి మంచితనాన్ని ఆసరాగా చేసుకుని తన సొంత ఆర్థిక సామ్రాజ్యాన్ని నిర్మించుకోవడమే లక్ష్యంగా ఆయన పావులు కదుపుతున్నారని పార్టీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి.

Kandula

రాజకీయ పదవుల పంపిణీలో సామాజిక మరియు ప్రాంతీయ సమీకరణాలు కీలక పాత్ర పోషిస్తాయి. నిబంధనల ప్రకారం ఒకే నియోజకవర్గం నుంచి, ఒకే సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు వ్యక్తులకు కీలక పదవులు ఇవ్వడం రాజకీయంగా సమతుల్యతను దెబ్బతీస్తుంది. ఇప్పటికే కాకినాడ సిటీ నుంచి కాపు సామాజిక వర్గానికి చెందిన తోట సుధీర్ సివిల్ సప్లైస్ చైర్మన్‌గా ఉన్నారు. తలాటం సత్య కూడా అదే ప్రాంతానికి, అదే వర్గానికి చెందిన వారు కావడంతో ఆయనకు పదవి ఇవ్వడం వల్ల ఇతర నియోజకవర్గాల్లో అసమ్మతి చెలరేగే అవకాశం ఉంది. గతంలో కుడా చైర్మన్ పదవిని వేరే నియోజకవర్గానికి చెందిన తుమ్మల బాబుకు ఇచ్చిన తరహాలోనే, ఇప్పుడు కూడా అదే ఫార్ములాను పాటించాలని పార్టీలోని మెజారిటీ నేతలు కోరుకుంటున్నారు.

పార్టీ కష్టకాలంలో ఉన్నప్పటి నుండి వెన్నంటి ఉన్న జగ్గంపేట, ప్రత్తిపాడు, పిఠాపురం వంటి నియోజకవర్గాల ఇన్‌ఛార్జ్‌లు మరియు సీనియర్ నేతలు ఇప్పుడు తలాటం సత్య వంటి వివాదాస్పద వ్యక్తులకు ప్రాధాన్యత ఇవ్వడాన్ని తప్పుపడుతున్నారు. కేవలం పైరవీలు చేసే వారికే పదవులు దక్కితే, క్షేత్రస్థాయిలో కష్టపడే కార్యకర్తలకు తప్పుడు సంకేతాలు వెళ్తాయని వారు హెచ్చరిస్తున్నారు. కుడా చైర్మన్ పదవి కోసం తుమ్మలపల్లి రమేష్ (జగ్గంపేట), కత్తిపూడి బాబీ (ప్రత్తిపాడు), లేదా ఓదూరి నాగేశ్వరరావు (పిఠాపురం) వంటి నమ్మకస్తులను పరిశీలించాలని విశ్లేషకులు సూచిస్తున్నారు. ఇలా చేయడం వల్ల ఆయా నియోజకవర్గాల్లో పార్టీ బలోపేతం అవ్వడమే కాకుండా, వివాదాలకు తావులేకుండా ఉంటుందని పార్టీ కేడర్ భావిస్తోంది.

  Last Updated: 08 Jan 2026, 10:32 PM IST