రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నేతల హౌస్ అరెస్టులను మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ఖండించారు. చంద్రబాబు గారు నిర్ధోషిగా బయటకు రావాలని దేవాలయాలు, మసీదులు, చర్చల్లో ప్రార్థించేందుకు వెళ్తున్న టీడీపీ నేతలను అడ్డుకోవడం జగన్ రెడ్డి దుర్మార్గపు పాలనకు నిదర్శనమన్నారు. సైకో రెడ్డి పాలనలో దేవుడిని దర్శించుకునే స్వేచ్ఛ కూడా ప్రజలకు లేదా? అని ఆయన ప్రశ్నించారు. ప్రజల మనిషి చంద్రబాబుపై జగన్ రెడ్డి కక్ష కట్టారని.. అక్రమ కేసులు బనాయించి జైలు పాలు చేశారని ఆరోపించారు. శాంతియుతంగా కార్యక్రమాలు నిర్వహించే హక్కు కూడా ప్రజలకు లేదంటే రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఎక్కడుందని ఆయన ప్రశ్నించారు. విజయవాడ, గుంటూరు, ఉభయగోదావరి, శ్రీకాకుళం, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో టీడీపీ నేతలను పోలీసులు గృహ నిర్బంధం చేయడం దుర్మార్గమన్నారు. ఇది పౌరుల ప్రాధమిక హక్కులకు భంగం కలిగించడమే అవుతుందని యనమల రామకృష్ణుడు తెలిపారు.
అధికార పార్టీకి ఒక రూలు ప్రతిపక్షాలకు మరో రూలా? రాష్ట్రమంతా పోలీస్ చట్టం ఉంటే ముఖ్యమంత్రి తిరుపతిలో సభ ఎలా పెట్టారో పోలీసులు సమాధానం చెప్పాలన్నారు. టీడీపీ నేతలు ఎక్కడైనా విధ్వంసాలకు, చట్ట వ్యతిరేకం కార్యాకలాపాలకు పాల్పడ్డారా.? పోలీసులు కూడా చట్టాలను అతిక్రమించి వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.ఎన్నికలు దగ్గర పడుతున్నా రాజారెడ్డి రాజ్యాంగాన్నే అమలు చేస్తామంటే కుదరని… వచ్చేది టీడీపీ ప్రభుత్వమే అనేది గుర్తుంచుకోవాలన్నారు. టీడీపీ నేతలను గృహ నిర్భంధాలు చేయడం ఇకనైనా మానుకోవాలని యనమల పోలీసులను హెచ్చరించారు.