అసైన్డ్ భూముల కేసులో మూడు నెలల పాటు ముందస్తు బెయిల్ ను మాజీ మంత్రి పొంగూరు నారాయణకు ఏపీ హైకోర్టు మంజూరు చేసింది. అమరావతి పరిధిలోని అసైన్డ్ భూముల కుంభకోణంలో కీలక నిందితుడిగా నారాయణ ఉన్నారు. ఆ మేరకు సీఐడీ కేసులు నమోదు చేసింది. ఈ కేసులో మంగళవారమే ఏపీ సీఐడీ పోలీసులు ఐదుగురిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ క్రమంలో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ నారాయణ హైకోర్టును ఆశ్రయించారు. ఆ పిటిషన్పై బుధవారం విచారణ చేపట్టిన హైకోర్టు నారాయణకు 3 నెలల పాటు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అనారోగ్యంతో బాధపడుతున్న నారాయణ విదేశాల్లో చికిత్స తీసుకోవాల్సి ఉందని నారాయణ తరఫు న్యాయవాది కోర్టుకు వివరించారు. ఇదే అంశంపై ఓ కేసులో హైకోర్టే నారాయణకు ముందస్తు బెయిల్ మంజూరు చేసిందని గుర్తు చేశారు. అయితే ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్నందున ముందస్తు బెయిల్ మంజూరు చేయరాదని ప్రభుత్వ తరఫు న్యాయవాది కోర్టును కోరారు. ఇరు వర్గాల వాదనలు విన్న కోర్టు నారాయణకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.